సాక్షి,చెన్నై: డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న ఉదయనిధి స్టాలిన్ను విడుదల చేయాలని మద్రాసు హైకోర్టు మంగళవారం పోలీసులను ఆదేశించింది. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని ఉదయనిధి స్టాలిన్కు సూచించింది.
సోమవారం తంజావూరులో కర్ణాటక,తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ నదీ జలాలకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నటి త్రిషను ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడులో తీవ్ర రాజకీయం దుమారం రేగింది. దీనిపై అధికార టీవీకే పార్టీతో పాటు పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు తమిళనాడులోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.
రంగంలోకి దిగిన పోలీసులు చెన్నై నీలాంకరైలోని ఉదయనిధి నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేయగా.. ఈ లోపు ఉదయనిధి స్టాలిన్ తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై మద్రాస్ హైకోర్టు మధ్యాహ్నం ప్రత్యేక విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ మాట్లాడుతూ.. ఉదయనిధిని తంజావూరుకు తరలించినప్పటికీ, ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపే ఉద్దేశం పోలీసులకు లేదని తెలిపారు. కేవలం విచారించి, స్టేషన్ బెయిల్పై విడుదల చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఉదయనిధి స్టాలిన్కు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజే ఆయనను విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో డీఎంకే శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.


