ఉదయ్‌నిధి స్టాలిన్‌ అరెస్ట్‌ | Trisha Row: Vijay's TVK Takes Udhayanidhi Stalin to Women's Commission | Sakshi
Sakshi News home page

ఉదయ్‌నిధి స్టాలిన్‌ అరెస్ట్‌

Aug 4 2026 10:44 AM | Updated on Aug 4 2026 11:39 AM

Trisha Row: Vijay's TVK Takes Udhayanidhi Stalin to Women's Commission

తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌ అరెస్ట్‌ అయ్యారు. సీఎం విజయ్‌, నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ తమిళగ వెట్రి కగళం పార్టీ ఫిర్యాదు చేయంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టీవీకే నిరసనల నడుమ పోలీసులు ఆయన నివాసం వద్ద భారీగా మోహరించగా.. ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఈ మధ్యాహ్నం మద్రాస్‌ హైకోర్టు విచారణ జరపనుంది.

మంగళవారం ఉదయం ఉదయనిధి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్ట్‌ తర్వాత ఆయన్ని తరలించే క్రమంలో డీఎంకే శ్రేణులు పోలీసులకు అడ్డు పడ్డాయి. వాహనాన్ని అడ్డుకుని వాగ్వాదానికి దిగాయి. అయినప్పటికి పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో ఉదయ్‌నిధి స్టాలిన్‌ మీడియాతో మాట్లాడారు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. ఎవరి పేరును నేను ప్రస్తావించలేదు. ఈ కేసును న్యాయపరంగా తేల్చుకుంటా అని ఆయన అన్నారు. విచారణ నిమిత్తం ఆయన్ని తరలించినట్లు తెలుస్తోంది.

ఏం జరిగిందంటే.. 
సోమవారం తంజావూరులో కావేరీ జలాల అంశంపై జరిగిన డీఎంకే కార్యక్రమంలో ఉదయ్‌నిధి స్టాలిన్‌ ప్రసంగిస్తున్న సమయంలో.. కొందరు కార్యకర్తలు సినీ నటి త్రిష పేరుతో నినాదాలు చేశారు. దీనికి స్పందించిన ఉదయ్‌నిధి.. కావేరీ జలాలు మన దగ్గరకు వచ్చినా రాకపోయినా, ‘నీళ్లు’ మాత్రం అక్కడికి వెళ్తాయి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి విజయ్‌, నటి త్రిషలను ఉద్దేశించి డబుల్‌ మీనింగ్‌గా చేసిన వ్యాఖ్యలేనని టీవీకే ఆరోపిస్తోంది. 

కేసు నమోదు.. హైకోర్టులో పిటిషన్‌
ఉదయ్‌నిధి వ్యాఖ్యల నేపథ్యంలో తంజావూర్‌ పీఎస్‌లో టీవీకే ఫిర్యాదు చేసింది. సీఎం విజయ్‌ను అవమానించారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనపై ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ మధ్యాహ్నం విచారణకు రావాల్సి ఉంది. ఈలోపే ఆయన్ని అరెస్ట్‌ చేయడం గమనార్హం.

“బహిరంగ క్షమాపణలు చెప్పాలి”.. 
ఉదయ్‌నిధి వ్యాఖ్యలపై టీవీకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. మహిళలను అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పార్టీ నేతలు స్పష్టం చేశారు. క్షమాఫలు చెప్పే దాకా ఉదయ్‌నిధి స్టాలిన్‌ను వదలబోమని అంటున్నారు.

ఉదయ్‌నిధి ఇంటి వద్ద భారీ భద్రత.. ఆ వెంటనే అరెస్ట్‌
టీవీకే నిరసనల నేపథ్యంలో చెన్నైలోని ఉదయ్‌నిధి స్టాలిన్‌ నివాసం వద్ద పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను పెంచారు. ఆ సమయంలో డీఎంకే కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో హైడ్రామా నెలకొంది. అయితే ఆ తర్వాతే ఉదయ్‌నిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. 

మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. 
ఈ వ్యవహారంపై మహిళా కమిషన్‌ (NCW)ను టీవీకే ఆశ్రయించింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పళా సెల్వకుమార్‌ ఫిర్యాదు చేస్తూ.. ఉదయ్‌నిధి ప్రసంగానికి సంబంధించిన వీడియోలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయ్‌నిధి నుంచి వివరణ కోరాలని, బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని మహిళా కమిషన్‌ను విజ్ఞప్తి చేశారు. అలాగే సంబంధిత చట్టాల కింద చర్యలు తీసుకునేలా పోలీసులకు సూచించాలని కోరినట్లు టీవీకే వెల్లడించింది.

బీజేపీ సైతం డీఎంకేపై ఫైర్‌
ఆ వ్యాఖ్యలు మహిళను(త్రిష) కించపరిచేలా ఉన్నాయని, రాజకీయ నాయకుల స్థాయికి తగవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై తమిళనాడు బీజేపీ కూడా స్పందించింది. ఉదయ్‌నిధి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ప్రజా జీవితంలో ఉన్న నేతలు మహిళల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

రాజకీయ పోరుకు కొత్త అస్త్రం
ఇప్పటికే తమిళనాడులో విజయ్‌ నేతృత్వంలోని టీవీకే, డీఎంకే మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో త్రిష ప్రస్తావన వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. టీవీకే ఈ అంశాన్ని మహిళా గౌరవానికి సంబంధించిన అంశంగా తీసుకుని ముందుకు వెళ్తుండగా.. డీఎంకే లేదా ఉదయ్‌నిధి స్టాలిన్‌ నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement