పట్టపగలు.. అదీ అందరూ చూస్తుండగానే ఓ పోకిరీ దారుణానికి తెగబడ్డాడు. తనపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ యువతిపై కిరాతానికి పాల్పడ్డాడు. టీచర్పై జరుగుతున్న దాడిని చూసి పిల్లలు, తోటి సిబ్బంది దూరంగా పరిగెత్తగా.. రక్తపు మడుగులో కుప్పకూలి ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
ఫరీదాబాద్ సిక్రోనా గ్రామంలోని సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్లో 29 ఏళ్ల సంధ్య టీచర్గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం సాధారణంగా పాఠశాలకు వచ్చిన ఆమెను కలవాలంటూ ఓ యువకుడు గేటు వద్దకు వచ్చాడు. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సంధ్య బయటకు వెళ్లగా.. అప్పటికే ముసుగు ధరించి ఉన్న నిందితుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు.
సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. నిందితుడు పాఠశాల లోపలే కొంతసేపు వేచి చూశాడు. సంధ్య బయటకు రాగానే ఆమెను పట్టుకుని లాగి కత్తితో వరుసగా పొడిచాడు. ముఖం, మెడ, ఛాతి, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. అర నిమిషంలో దాదాపు 20 నుంచి 30 సార్లు కత్తితో దాడి చేసినట్లుప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ అరుపులు విని పాఠశాల నిర్వాహకుడు తేజ్పాల్ అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే నిందితుడు అతడిపై కూడా కత్తితో దాడికి యత్నించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అనంతరం సంధ్యపై మరోసారి దాడి చేసి బైక్పై పరారయ్యాడు.
రెండు గంటల్లో అరెస్ట్
ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగాడు. నిందితుడి కోసం గాలించి.. రెండే గంటల్లో అరెస్ట్ చేశాడు. అతన్ని అమిత్(21)గా గుర్తించగా.. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు.
వేధింపుల కేసే కారణమా?
ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమిత్కు సంధ్యతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఆమె మాట్లాడేందుకు ఆసక్తి చూపకపోయినా.. నిందితుడు వెంటపడుతూ వేధించేవాడని తెలుస్తోంది. వేధింపులు ఎక్కువయ్యే సరికి ఈ మధ్యే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు కూడా నమోదు అయ్యింది. అయితే ఫిర్యాదు తర్వాత అమిత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఆమె కేసు వాపసు తీసుకుంది. అయితే ఆ ప్రతీకారంతోనే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.


