మల్లెంకొండయ్య మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు
ఇప్పుడే వస్తానని విద్యార్థులకు చెప్పి వెళ్లి పెట్రోల్ పోసుకుని బలవన్మరణం
వైఎస్సార్ కడప జిల్లా రామిరెడ్డిపాలెం ఎస్టీ కాలనీలో ఘటన
గోపవరం: వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం రామిరెడ్డిపాలెం ఎస్టీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గువ్వల మల్లెంకొండయ్య(45) వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపవరం మండలం బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన గువ్వల చిన్నకొండయ్య, కొండమ్మ దంపతుల ఏకైక కుమారుడైన మల్లెంకొండయ్య బద్వేలులో నివాసముంటున్నారు.
ఎనిమిదేళ్లుగా రామిరెడ్డిపాలెం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సోమ వారం ఎప్పటిలాగే స్కూల్కు వచ్చిన ఆయన సంచిలో పెట్రోల్ బాటిల్ను వెంట తెచ్చుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ‘ఇప్పుడే వస్తా’నని విద్యార్థులకు చెప్పి బయటకు వెళ్లారు. పాఠశాలకు కొద్దిమీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లిన మల్లెంకొండయ్య వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. క్షణాల వ్యవధిలోనే మంటలు శరీరమంతా వ్యాపించడంతో తీవ్రంగా కాలిపోయి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.
భీతిల్లిన విద్యార్థులు
నిత్యం ఎంతో ఆప్యాయంగా పాఠాలు చెప్పే గురువు ఇలా స్కూల్ పక్కనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయం తెలిసి విద్యార్థులు భయంతో ఏడుస్తూ ఇళ్లకు పరుగులు తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తోటి ఉపాధ్యాయులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషయం తెలుసుకున్న ఎంఈవోలు రఘురాములు, చెన్నయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మల్లెంకొండయ్య విధినిర్వహణలో ఎప్పుడూ గైర్హాజరు కాలేదని, సమయపాలన పాటిస్తూ ఉత్తమంగా పనిచేసేవారని వారు గుర్తుచేసుకున్నారు.
బద్వేలు రూరల్ ఎస్ఐ రంగారావు సిబ్బందితో కలిసి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మల్లెంకొండయ్యకు భార్య శిరీష, పదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. అండగా ఉంటాడనుకున్న మల్లెంకొండయ్య ఇలా ఘోరమైన స్థితిలో ప్రాణాలు కోల్పోవడంతో వృద్ధ తల్లిదండ్రులు, భార్య, కుమార్తె మృతదేహం వద్ద విలపించిన తీరు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


