బద్వేలు అర్బన్ : కడపునొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం బద్వేలులో చోటు చేసుకుంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని భావనారాయణనగర్లో గొడ్లవీటి గురయ్య, గొడ్లవీటి ఆదిలక్షుమ్మ (50) దంపతులు నివసిస్తుండేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా ఇరువురికి వివాహం జరిపించారు. గురయ్య బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. అయితే కొంత కాలంగా ఆదిలక్షుమ్మ కడుపునొప్పితో బాధపడుతుండేది. కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం బద్వేలు సమీపంలోని పెద్ద చెరువు వద్దకు వెళ్లి అక్కడ పేడరంగు తాగి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత చుట్టుపక్కల వారు గమనించి అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆదిలక్షుమ్మ మృతి చెందింది. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి మృతురాలి పెద్ద కుమార్తె మధులత ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


