● కేసు ఛేదించిన పోలీసులు
● నిందితుడి అరెస్ట్
పులివెందుల రూరల్ : హత్యను ప్రమాదంగా చిత్రీకరించిన కేసును ఛేదించి లారీ, ఇనుప జాకీ రాడ్డు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశామని పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన లారీ డ్రైవర్ పఠాన్ మహబూబ్ బాషా (40) హత్యకు గురైన కేసులో నిందితుడు షేక్ నూర్బాషాను విశ్వసనీయ సమాచారం ఆధారంగా పులివెందుల పట్టణంలోని సమ్యు గ్లాస్ ఫ్యాక్టరీకి వెళ్లే మార్గంలో అరెస్టు చేశామన్నారు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, ఆగస్టు 1న గోరంట్ల నుంచి పులివెందుల వైపు వస్తున్న సమయంలో డ్రైవింగ్ విషయంలో.. గతంలో ఏర్పడిన విభేదాల కారణంగా కదిరి రోడ్డులోని నామాలగుండు సమీపంలో నిందితుడు ఇనుప జాకీ రాడ్డుతో మహబూబ్ బాషా తలపై దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు సుమారు రెండు గంటల తర్వాత మృతదేహాన్ని లారీలో కనంపల్లి సమీపానికి తీసుకెళ్లి.. లారీతో తొక్కించి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి లారీతోపాటు హత్యకు ఉపయోగించిన ఇనుప జాకీ రాడ్డును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. సమావేశంలో రూరల్ సీఐ శాంతి లాల్, ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, తిమోతి, గంగాధర్రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.


