● నిందితుడి అరెస్ట్ ● 7 బైక్లు స్వాధీనం
ప్రొద్దుటూరు క్రైం : అతను కుటుంబ పోషణ కోసం డెలవరీ బాయ్గా మారాడు. అయితే ఎంత కష్టపడ్డా ఆశించినంత డబ్బు రావడం లేదని తుదకు దొంగావతారం ఎత్తాడు. ఈ క్రమంలో బైక్లను చోరీ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. బైక్లను దొంగలిస్తున్న సూర్యగురు తేజ అనే యువకుడిని వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను సోమవారం సాయంత్రం ఎస్డీపీఓ ఆఫీసులో ఏఎస్పీ విభూకృష్ణ మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరు మండలంలోని పెన్నానగర్కు చెందిన సూర్యగురుతేజ ఇంటర్ వరకు చదువుకున్నాడు. తర్వాత జీవనోపాధి కోసం తమిళనాడు వెళ్లాడు. అక్కడ ఏ పని దొరక్కపోవడంతో పేరున్న ఫుడ్ డెలివరీ సంస్థలో డెలవరీ బాయ్గా చేరాడు. ఆశించినంత వేతనం దొరక్కపోవడంతో కొన్ని నెలల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అతను చెడు వ్యసనాలు అలవర్చకున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నిర్మానుష్య, జనసంచారం లేని ప్రాంతాల్లో పార్క్ చేసిన బైక్లను చోరీలు చేయడం ప్రారంభించారు. ఆరు నెలల్లో అతను 10 చోట్ల ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడు. నిందితుడు ప్రొద్దుటూరులోని ఈశ్వరరెడ్డినగర్లో ఉన్న అక్కదేవతల గుడి వద్ద ఉన్నాడని తెలియడంతో వన్టౌన్ సీఐ కొండారెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐలు శ్రీనివాసులు, మధుసూదన్రెడ్డిలు సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 7 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.3.50 లక్షలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిచనున్నట్లు చెప్పారు.


