సాక్షి, ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ( మంగళవారం) పార్లమెంట్ మార్చ్ చేపట్టనున్నారు. తాను ప్రధాని నివాసానికి వెళ్లి, ఇథనాల్ విధానానికి వ్యతిరేకంగా 2.33 లక్షల మందికి పైగా సంతకం చేసిన వినతిపత్రాన్ని స్వయంగా అందజేస్తానని నిన్న ప్రకటించారు. ఈ నేపథ్యంలో వంద మందితో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ మార్చ్ చేపట్టనున్నారు.
ప్రజలకు ఇంధనం వేసుకునే సమయంలో ప్యూర్ పెట్రోల్, ఇథనాల్ పెట్రోల్ అనే రెండు ఆప్షన్స్ ఇవ్వాలని ఈ 20 పెట్రోల్తో వాహనాల ఇంజిన్ సామర్థ్యం తగ్గుతుందని కేజ్రీవాల్ ఆరోపించారు.ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మార్చ్కు పిలువునివ్వడంతో ఏమవుతుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.
కాగా నిన్న కేజ్రీవాల్ మాట్లాడుతూ "కొన్ని రోజుల క్రితం ప్రధానికి ఉద్దేశించి ఆన్లైన్ వినతిపత్రం ప్రారంభించాం. చాలా తక్కువ సమయంలోనే సుమారు 2,33,238 మంది దానిపై సంతకం చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నా కార్యాలయం నుంచి 100 మందితో కలిసి ప్రధాని నివాసానికి బయలుదేరుతాను. ఈ వినతిపత్రాన్ని ఆయనకు స్వయంగా అందించి, ఇథనాల్ విధానంలో ఉన్న లోపాల గురించి చర్చించాలని కోరతాం" అని అన్నారు.
గత శనివారం న్యూఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ బయట నిర్వహించిన టౌన్హాల్ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "గతంలో ప్రధానికి ఉద్దేశించిన వినతిపత్రంపై సంతకం చేయాలని మిమ్మల్ని కోరాను. 2,00,000 మందికి పైగా ఆన్లైన్లో సంతకం చేశారు. ఆ సంతకాల ప్రింట్లను తీసుకున్నాను. మంగళవారం 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నేను స్వయంగా ప్రధాని నివాసానికి వెళ్లి ఆ వినతిపత్రాన్ని అందజేస్తాను" అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు 100 మందితో పార్లమెంట్ మార్చ్ చేపట్టనున్నారు.


