సాక్షి, ఢిల్లీ: బిహార్లో ప్రశాంత్ కిషోర్ విజయంతో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలిందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.ఈ విజయంతో బీజేపీపై ప్రజల్లో ఏ విధంగా వ్యతిరేకత ఉందో స్పష్టంగా అర్థమైందన్నారు.బిహార్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్కు అభినందనలు చెబుతూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ తన ఎక్స్ ఖాతాలో " బీజేపీ తన జాతీయ అధ్యక్షుడి సీటును కూడా కోల్పోయింది. బంకిపూర్ నుంచి ప్రశాంత్ కిషోర్ జీ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు హృదయపూర్వక అభినందనలు. బీజేపీ పట్టు పూర్తిగా చేజారిపోయింది. నిధుల దుర్వినియోగం, పత్రాల లీకులు, ఈ20... మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అహంకారం బద్దలవుతోంది. దేశ ప్రజలు మార్పునకు స్పష్టమైన సంకేతం ఇచ్చారు," అని ఆయన రాసుకొచ్చారు.
మరోవైపు ప్రశాంత్ కిషోర్ను అభినందిస్తూ బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఎక్స్లో పోస్ట్ చేశారు."ప్రజాస్వామ్య మహోత్సవంలో, బంకిీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రజలు జన సురాజ్ను ఎన్నుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తూ, విజయం సాధించిన శ్రీ ప్రశాంత్ కిషోర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను," అని పేర్కొన్నారు.
కాగా దేశంలోని బంకీపూర్, మంజల్పూర్, దతియా అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరిగింది. బిహార్లోని బంకీపూర్ నియోజకవర్గంలో జనసురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. ఆయన 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ నేత నీరజ్ కుమార్పై విజయం సాధించారు.
గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ (సతీశ్ పటేల్) విజయం సాధించారు. ఆయనకు మొత్తం 55,481 ఓట్లు పడగా 30,630 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి భిఖంభాయి రబారీ రెండో స్థానానికి పరిమితమయ్యారు.
మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ విజయం సాధించారు. ఆయనకు మొత్తం 66757 ఓట్లు రాగా, 6,016 తేడాతో బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై గెలుపొందారు.


