ఢిల్లీ: ఈ20 పెట్రోల్ కి వ్యతిరేకంగా ఢిల్లీలో శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ సదస్సు నిర్వహించింది. మాజీ సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆఫ్లైన్, ఆన్లైన్లో కలిసి మొత్తం 6 లక్షల మందికి పైగా హాజరయ్యారు. E20ని వ్యతిరేకిస్తూ ప్రధానికి రాసిన పిటిషన్ పై 2 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. ప్రధానికి మంగళవారం (ఆగస్టు 4) స్వయంగా పిటిషన్ అందజేస్తానని కేజ్రీవాల్ అన్నారు. లాఠీఛార్జీకి భయపడని 100 మందితో కలిసి వెళ్తానని తెలిపారు. ఈ20కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాల్సిందేనని తెలిపారు.
‘‘ఎవరూ భయపడొద్దు.. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయాలి. ఇథనాల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోతుంది, పాడవుతున్నాయి. ప్రభుత్వం స్టడీ చేసిన రిపోర్ట్ బయటపెట్టాలి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, ఆయన కొడుకులకు మేలు చేసేందుకే ఇథనాల్ తీసుకువచ్చారు.
అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్లో భాగంగా దేశంపై ఇథనాల్ ను రుద్దుతున్నారు. మేం చదువుకున్నవాళ్లం.. మీ డిగ్రీ ఎలాగో నకిలీది.. మా డిగ్రీ అసలైంది. ఆర్టీఐ ద్వారా నా డిగ్రీ వివరాలు కూడా తీసుకున్నారు. ప్రశ్నిస్తే FIR లు నమోదు చేస్తున్నారు. E20లో ఏదో గందరగోళం ఉంది. లేదంటే ప్రశ్నిస్తే మాట్లాడాలి కానీ కేసులు పెట్టడం ఏంటి?
పెట్రోల్, డీజిల్ వాహనాల కొనుగోలు ఆపేయండి. కొంటే ఎలక్ట్రిక్ వాహనాలను కొనండి. E20 విషయంలో ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు పెడుతున్నాం. 1.ప్రతి పెట్రోల్ బంక్ లో వినియోగదారుడికి ఆప్షన్ ఉండాలి. 2. ప్యూర్ పెట్రోల్ కంటే, E20 పెట్రోల్ ధర తక్కువగా ఉండాలి. 3.పెట్రోల్ ధరను 84 రూపాయలే ఉంచాలి’’ అని అన్నారు.
పెట్రోల్ ధర రూ. 125 అయ్యేది!
ప్రపంచ ముడి చమురు ధరలు బ్యారెల్కు 135 డాలర్లకు పెరిగినప్పుడు, ఇంధనంలో ఇథనాల్ కలపకపోతే ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.125 అయ్యేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇథనాల్ వల్ల, వినియోగదారులు లీటరుకు రూ. 94.77 మాత్రమే చెల్లించారని తెలిపింది. ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజీ, ఇంజిన్ పై ప్రభావం పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. చమురు సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ఇథనాల్ వినియోగం ఒక మార్గమని తెలిపింది.


