సాక్షి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. అభివృద్ధికి కొత్త ద్వారమని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని స్పీచ్ను ఎంపీ, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలుగులో తర్జుమా చేసి ప్రజలకు వినిపించారు.
పవిత్రమైన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని.. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ పైడితల్లి అమ్మవారికి, సింహాచలం అప్పన్నకు నమస్కరిస్తున్నా. స్వర్ణాంధ్ర విజన్కు ఇవాళ కీలక రోజు. రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను శ్రీకారం చుట్టాం. ఇవాళ రెండు రికార్డులు సృష్టించాం. ఒకటి ఎయిర్పోర్ట్.. రెండోది థింసా నృత్యం. 13 వేల మందికిపైగా గిరిజన పిల్లలు ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది.
.. ఇది అల్లూరి సీతారామ రాజు నడియాడిన నేల. గిరిజన హక్కుల కోసం ఆయన తన జీవితాన్నిఅంకితం చేశారు. ఇదే భూమిపై ఇవాళ అభివ ల్యాంచ్ప్యాడ్ ప్రారంభమైంది. ఎయిర్పోర్టుల పేర్లను ఒక కుటుంబానికి పరిమితం చేయలేదు. అయోధ్య ఎయిర్పోర్టుకు వాల్మీకి, ఇవాళ అల్లూరి పేరు పెట్టుకున్నాం. 2014 కంటే ముందు దేశంలో 74 ఎయిర్పోర్టులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 166కి చేరింది. చిన్న పట్టణాలకు నుంచి నగరాలకు ఎయిర్ సేవలు ఉన్నాయి.
ఉడాన్ పథకం వల్ల ఎయిర్పోర్టుల సంఖ్య మాత్రమే పెరగలేదు.. ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ అమృత్సర్ వరకు విస్తరించింది. బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నాం. ఈ మొత్తం కోస్టల్ ఏరియాను అభివృద్ధి చేస్తున్నాం. మూలపేట, రామయపట్నం పోర్టులను నిర్మిస్తున్నాం. ఐటీ రంగంలో ప్రపంచానికి ఏపీ యువత తమ ట్యాలెంట్ను చూపిస్తున్నారు. ఏపీ యువత దేశానికి కూడా ఉపయోగపడాలి. ఒక్క ఫ్యాక్టరీతో ఏ గ్రోత్సెంటర్ నిర్మితం కాదు. ఇక్కడ గూగుల్ కూడా డేటా సెంటర్ నిర్మిస్తోంది. నక్కపల్లిలో ఫార్మ్ పార్క్ రాబోతోంది. విశాఖను ఇండస్ట్రీయల్ హబ్గా తీర్చిదిద్దుతాం.
భోగాపురం విమానాశ్రయం.. అభివృద్ధికి కొత్త ద్వారం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కొత్త అవకాశాలు వస్తాయి. విమాన రవాణా విస్తరణతో పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందుతాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


