జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు శుక్రవారం సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేయడంతో, ఏళ్ల తరబడి సాగిన న్యాయ పోరాటానికి తెరపడింది. దాంతో ఆయన భార్య పాయల్ నాథ్ పేరు వార్తల్లో మరోసారి నిలిచింది. ఆమె ప్రజా జీవితానికి దూరంగా ఉంటూ పారిశ్రామికవేత్తగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నప్పటికీ..రాజకీయ కుటుంబ నేపథ్యం రీత్యా ఆమె మీడియా దృష్టిని ఆకర్షించింది. భర్త ఒమర్ అబ్దుల్లా రాజకీయ ప్రయాణానికి అత్యంత భిన్నమైన మార్గం ఆమెది. ఇంతకీ ఎందుకు ఈ దంపతుల విడాకులు కేసు చర్చనీయాంశమైందంటే...
కారణం ఇదే..
పాయల్, ఒమర్ అబ్దుల్లాల వివాహం 1994లోనే జరిగినా 2007లో తమిద్దరి మధ్య వైవాహిక సంబంధాలు లేవని ఒమర్ అబ్దుల్లా కోర్టుకు గతంలోనే వెల్లడించారు. 2009 నుంచి భార్యభర్తలు ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. ఒంటరిని చేయడం, క్రూరత్వాన్ని ప్రదర్శించడం వంటి అంశాల ఆధారంగా పాయల్ నుంచి విడాకులు ఇప్పించాలని ఒమర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
అయితే 2016లో ఫ్యామిలీకోర్టు దీన్ని తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఒమర్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. 2023లో ఢిల్లీ హైకోర్టు కూడా ఫ్యామిలీకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పాయల్కు నెలకు రూ.1.5 లక్షలు, సంతానం చదువుల కోసం ఒకొక్కరికి నెలకు రూ.60 వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఒమర్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. పాయల్ తన స్పందనను తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే జూలై 22న ఒమర్ ఆర్టికల్ 142 కింద వివాహాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును అర్థించారు. తాము పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని, పెండింగ్లో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకున్నామని ధర్మాసనానికి తెలియజేసిన తర్వాత, వారి వివాహాన్ని రద్దు చేయడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఆ విధంగా ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి కోర్టు విడాకులు మంజూరు చేయడంతో, ఏళ్ల తరబడి సాగిన విడాకులు కేసుకి పులిస్టాప్ పడింది.
ఎవరీ పాయల్నాథ్..?
పాయల్ నాథ్ జూన్ 6, 1973న ఢిల్లీలో సిక్కు కుటుంబంలో జన్మించారు. ఆమె మూలాలు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న లాహోర్కు చెందినవి. ఆమె దివంగత మేజర్ జనరల్ రామ్ నాథ్ కుమార్తె. సైనిక కుటుంబంలో పెరగడం వల్ల, ఆమె తన బాల్యంలో ఎక్కువ భాగం వివిధ కంటోన్మెంట్లలో గడిపారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీషులో ఆనర్స్ డిగ్రీని అభ్యసించడానికి ముందు, ఒక ఆర్మీ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.
వారిద్దరు ఎలా కలుసుకున్నారంటే..
ఒమర్ అబ్దుల్లా రాజకీయాల్లోకి ప్రవేశించడానికి చాలా కాలం ముందు, ఆయన, పాయల్ నాథ్ ఇద్దరూ ఆతిథ్య రంగంలో పనిచేశారు. న్యూఢిల్లీలోని 'ది ఒబెరాయ్'లో పనిచేస్తున్నప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు. ఒమర్ అబ్దుల్లా ఆ విలాసవంతమైన హోటల్ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుండగా, పాయల్ నాథ్ కూడా అదే సంస్థలో భాగంగా ఉన్నారు. వారి వృత్తిపరమైన పరిచయం క్రమంగా వ్యక్తిగత సంబంధంగా మారింది. అలా ఈ జంట సెప్టెంబర్ 1, 1994న వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు జహీర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు 17 సంవత్సరాల వివాహ బంధం తర్వాత, ఆ దంపతులు సెప్టెంబర్ 2011లో విడిపోయారు. విడిపోయిన తర్వాత, పాయల్ రాజకీయ జీవితానికి, ప్రజా దృష్టికి దూరంగా ఉంటూ, వారి పిల్లలతో కలిసి న్యూఢిల్లీలో నివసిస్తూన్నారు.
ఆమె నడిపే వ్యాపారాలు ఇవే..
పాయల్ నాథ్ రాజకీయ జీవితానికి దూరంగా వ్యవస్థాపకతను ఎంచుకున్నారు. ఆమె 'జైరు నేచురల్లే' అనే మినరల్ వాటర్ కంపెనీకి యజమాని. దీని తయారీ కేంద్రం కులుకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో, కులు-మనాలి హైవేపై ఉంది. ఈ వ్యాపారంతో పాటు, ఆమె ఢిల్లీ కేంద్రంగా ఒక ట్రావెల్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
ఆమె వ్యాపార ఆసక్తులు ఎక్కువగా ఆతిథ్యం, పర్యాటక రంగాలతో ముడిపడి ఉన్నాయి. ఈ రంగాలతో ఆమెకు తన కెరీర్ ప్రారంభ సంవత్సరాల నుంచే పరిచయం ఉంది. ఆమె వ్యవస్థాపక ప్రయాణం తన మాజీ భర్త రాజకీయ గుర్తింపుతో సంబంధం లేకుండా స్వతంత్రంగా నిర్మించుకున్నారు. ఆమె బహిరంగంగా కనిపించడం అరుదు, అలాగే మీడియాకు దూరంగా ఉంటూ తన వృత్తిపరమైన ఐడెంటిటీతో సాగిపోవడమే ఆమెను ప్రత్యేకంగా నిలిపింది.
(చదవండి: ఐదు పదుల వయసులోనూ యంగ్గా నటి శోభనా..! ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..)


