కేంద్రంపై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం
జమ్మూ: జమ్మూకశ్మీర్కు సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర హోదా కల్పించాలని ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 20 నుంచి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఆదివారం జమ్మూలో జరిగిన ఓ నిరసన ర్యాలీలో ఒమర్ అబ్దుల్లా ప్రసంగించారు. ‘‘నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనపై బీజేపీ నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఢిల్లీలో ఇలాంటి నిరసనల వల్ల రాష్ట్ర హోదా లభించదని అంటున్నారు. మరి ఢిల్లీలో కాకపోతే ఇంకెక్కడ నిరసన చేపట్టాలి?’’ అని ఒమర్ ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్లో, అసెంబ్లీలో నిరసనల ద్వారా రాష్ట్ర హోదా కోసం తాము చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ దెబ్బతీసిందని ఆరోపించారు. ఇప్పుడు దేశ రాజధానిలో నిరసన విషయంలోనూ అదే కుట్ర చేస్తోందని నిప్పులు చెరిగారు. రాష్ట్ర హోదాను సాధించేందుకు అమెరికాకు వెళ్లి వైట్హౌస్ బయట నిరసన తెలపాలా? అని ప్రశ్నించారు. సొంత దేశంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాత్రమే తాము కోరుతున్నామని చెప్పారు.


