‘భార్య సమాధిపై భర్తకు హక్కులు లేవు’ | Man Moves Court To Save Wifes Grave In Shaheen Bagh Denied Exclusive Rights | Sakshi
Sakshi News home page

‘భార్య సమాధిపై భర్తకు హక్కులు లేవు’

Jul 12 2026 12:04 PM | Updated on Jul 12 2026 12:34 PM

Man Moves Court To Save Wifes Grave In Shaheen Bagh Denied Exclusive Rights

న్యూఢిల్లీ: పబ్లిక్ స్మశానవాటికల్లో  ఏ ఒక్క సమాధిపైనా ఎవరికీ ప్రత్యేక హక్కులు ఉండవని ఢిల్లీలోని సాకేత్ కోర్టు స్పష్టం చేసింది. షాహీన్ బాగ్ కబరస్థాన్‌లోని తన భార్య సమాధిని మరొకరి అంత్యక్రియల కోసం ఉపయోగించకుండా నిలువరించాలని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. పిటిషనర్ తన భార్య ఏప్రిల్ 2021లో మరణించిందని, ఆమెను షాహీన్ బాగ్ కబరస్థాన్‌లో ఖననం చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం, సమాధిలోని మృతదేహం పూర్తిగా క్షీణించే (కలిసిపోయే) వరకు అదే స్థలంలో మరొకరి అంత్యక్రియలు నిర్వహించకూడదని ఆయన వాదించారు. తనకు సమాధిపై శాశ్వత యాజమాన్య హక్కులు అవసరం లేదని, భార్య గౌరవార్థం ఆమె సమాధిని ఏడేళ్లపాటు కదిలించకుండా ఉంచాలని కోరారు.

శాస్త్రీయ ఆధారాలు లేవు: కోర్టు
కబరస్థాన్ నిర్వాహకులు ఈ వాదనను వ్యతిరేకించారు. పబ్లిక్ కబరస్థాన్‌లోని నిర్దిష్ట సమాధిపై ఎవరికీ చట్టపరమైన లేదా మతపరమైన ప్రత్యేక హక్కులు ఉండవని పేర్కొన్నారు. ఢిల్లీలో కబరస్థాన్ భూమి కొరత తీవ్రంగా ఉందని, అందువల్ల పాత సమాధులను పునరుపయోగించడం తప్పనిసరని వివరించారు.
దీనిపై సాకేత్ కోర్టు జిల్లా న్యాయమూర్తి అతుల్ అహ్లావత్ స్పందిస్తూ.. మృతదేహం పూర్తిగా క్షీణించడానికి ఎంత సమయం పడుతుందనే విషయమై ఇరుపక్షాలూ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలను చూపలేదని పేర్కొన్నారు. శాస్త్రీయ మద్దతు లేకుండా కేవలం ఏడేళ్ల సమయం పడుతుందని చెప్పడాన్ని అంగీకరించలేమని, దీని ఆధారంగా ఎలాంటి తాత్కాలిక ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేశారు.

‘ప్రైవేటు అవసరాలకు కేటాయించలేం’
ఒక నిర్దిష్ట సమాధిని కొన్ని సంవత్సరాల పాటు భద్రపరచాలని అధికారులను ఆదేశిస్తే, అది ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూమిపై ప్రైవేట్ హక్కులను కల్పించినట్లు అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. కబరస్థాన్ భూమి ముస్లిం సమాజం అందరి అవసరాల కోసమని, దీనిని ఒక వ్యక్తి ప్రయోజనం కోసం రిజర్వ్ చేయలేమని స్పష్టం చేసింది. అయితే, ఇస్లామిక్ చట్టాల ప్రకారం సాధారణంగా సమాధులను తవ్వడం మృతుల గౌరవానికి భంగం కలిగిస్తుందని వారించినప్పటికీ, అనివార్య పరిస్థితుల్లో సమాధులను పునరుపయోగించడానికి ఇస్లామిక్ న్యాయశాస్త్రం అనుమతిస్తోందని కోర్టు గుర్తుచేసింది. ప్రస్తుత తీర్పు తాత్కాలిక ఉపశమనానికి సంబంధించినది మాత్రమేనని, ప్రధాన కేసు విచారణ సమయంలో పిటిషనర్ శాస్త్రీయ ఆధారాలను సమర్పించవచ్చని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement