వాషింగ్టన్: భారత్ జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని ఆరుగురు సహచరులపై అమెరికా న్యాయ శాఖ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. అందులో హత్యలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, డ్రగ్స్,మానవ అక్రమ రవాణా వంటి అనేక అంతర్జాతీయ నేరాలకు పాల్పడ్డారనే వివరాలను అధికారులు పొందుపరిచారు.
లారెన్స్ బిష్ణోయ్ 2015 నుండి భారత్లో జైలు శిక్షను అనుభవిస్తున్నప్పటికీ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్(VoIP) సాంకేతికత ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తన నేర నెట్వర్క్ను నేరుగా నడుపుతున్నట్లు అమెరికా దర్యాప్తులో స్పష్టమైంది.
అమెరికా ఛార్జ్షీట్ వివరాల ప్రకారం, లారెన్స్ బిష్ణోయ్ మరియు ఉత్తర అమెరికాలో ఉన్న అతని ప్రధాన అనుచరుడు గోల్డీ బ్రార్ కలిసి 18 జూన్ 2023న కెనడాలోని సర్రేలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను కాల్చి చంపాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ను మే 2022లో పంజాబ్లో దారుణంగా కాల్చి చంపిన ఘటనకు బిష్ణోయ్ గ్యాంగే పూర్తి బాధ్యత వహించినట్లు తెలిపింది.
దీంతో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ను చంపాలనే ఉద్దేశాన్ని బిష్ణోయ్ పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపరిచాడు. ఏప్రిల్ 2024లో ముంబైలోని నటుడి నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనకు కూడా ఈ సిండికేట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని దర్యాప్తు సంస్థ తెలిపింది. ఇలా లారెన్స్ బిష్ణోయ్ తన నేర సామ్రాజ్యాన్ని భారత్ నుంచి అమెరికా, కెనడా, బ్రిటన్, యూరప్ వంటి పలు అభివృద్ధి చెందిన దేశాలకు విస్తరించాయి.
ప్రస్తుతం ఈ గ్యాంగ్లో గోల్డీ బ్రార్ ఉత్తర అమెరికా విభాగాన్ని, రోహిత్ గొదారా యూరప్ విభాగాన్ని, సుఖ్రాజ్ సింగ్ కాంగ్ భారతదేశ కార్యకలాపాలను లీడ్ చేస్తున్నారు. అమెరికా దాఖలు చేసిన ఈ ఛార్జ్షీట్ కారణంగా గ్లోబల్ స్థాయిలో లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్పై చట్టపరమైన నిఘా మరియు చర్యలు మరింత కఠినతరం కానున్నాయి.


