భారతదేశ ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ (ఏబీడీఎం) ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ల్లో ఒకటిగా అవతరించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 93.95 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు (ఆబా) జనరేట్ అయ్యాయని, వీటికి అనుబంధంగా 105 కోట్ల ఆరోగ్య రికార్డులను డిజిటల్గా లింక్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది.
శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా అధ్యక్షతన జరిగిన మిషన్ స్టీరింగ్ గ్రూప్ మూడో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ గణాంకాలను వెల్లడించారు. ఈ సందర్భంగా దేశంలో డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన భవిష్యత్తు కార్యాచరణ (రోడ్మ్యాప్)పై చర్చించారు.
రికార్డు స్థాయిలో డిజిటల్ నమోదు
దేశంలో వైద్య సేవలను పారదర్శకంగా, వేగవంతంగా మార్చే ప్రక్రియలో భాగంగా నేషనల్ డిజిటల్ హెల్త్ రిజిస్ట్రీల్లో భారీగా నమోదు ప్రక్రియ సాగుతోంది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం..
ఆరోగ్య ఖాతాలు (ఆబా) 93.95 కోట్లు దాటాయి.
లింక్ అయిన హెల్త్ రికార్డులు 105 కోట్లకు పైగా ఉన్నాయి.
నమోదైన ఆరోగ్య సౌకర్యాలు (హాస్పిటల్స్/క్లినిక్స్) 5.33 లక్షలు.
నమోదైన ఆరోగ్య సంరక్షణ నిపుణులు (డాక్టర్లు/నర్స్ లు) 9.85 లక్షల మంది.
2.72 లక్షల ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏబీడీఎం సాఫ్ట్వేర్ సాంకేతికతను వాడుతున్నాయి.
ఆసుపత్రుల్లో ఓపీడీ కోసం క్యూలైన్ బాధలు తప్పించే ‘స్కాన్ అండ్ రిజిస్టర్’ విధానం ద్వారా దాదాపు 24 కోట్ల టోకెన్లను జనరేట్ చేశారు.
డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలక పాత్ర
నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను సామాన్యుడికి సైతం చేరవేయడంలో, పౌరుల ఆరోగ్య రికార్డులను అత్యంత సురక్షితంగా భద్రపరచడంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవాత్మక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి జె.పి.నడ్డా స్పష్టం చేశారు. ‘సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తోంది. ప్రతి పౌరుడికి సులభంగా, పారదర్శకంగా వైద్య సేవలు అందడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది’ అని నడ్డా చెప్పారు.
ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్!


