Health: శరీరం ఇచ్చే సంకేతాలను వినాలి.. | Awareness Regarding Menstrual Issues And Necessary Precautions | Sakshi
Sakshi News home page

Health: శరీరం ఇచ్చే సంకేతాలను వినాలి..

Jul 10 2026 8:11 AM | Updated on Jul 10 2026 8:11 AM

Awareness Regarding Menstrual Issues And Necessary Precautions

పీరియడ్‌ సేఫ్‌

‘నెలసరి సమస్యల గురించి, పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత అవగాహన పెరుగుతుంది’ అంటున్నారు వైద్యులు. ‘శరీరం ఇచ్చే సంకేతాలను వినాలి, అర్థం చేసుకోవాలి’ అంటున్నారు. పీరియడ్‌ సేఫ్‌ గురించి స్త్రీల వైద్య నిపుణులు చెప్పే విషయాలు తెలుసుకుందాం.. ఆచరణలో పెడదాం..

సేఫ్‌ పీరియడ్‌ పద్ధతిని అనుసరించాలనుకునే మహిళలు ముందుగా తమ రుతుక్రమ చక్రాన్ని కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు గమనించడం మంచిది. ప్రతి నెల పీరియడ్స్‌ ప్రారంభమైన తేదీని నమోదు చేసుకోవడం, చక్రం క్రమబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. అవసరమైతే మొబైల్‌ యాప్‌ లేదా క్యాలెండర్‌ను ఉపయోగించవచ్చు. సాధారణంగా 28 రోజుల క్రమబద్ధమైన నెలసరి చక్రం ఉంటుంది. అయితే, ప్రతి మహిళ రుతుక్రమ చక్రం ఒకేలా ఉండదు. కొందరికి 21 రోజులు, మరికొందరికి 35 రోజుల వరకు కూడా సైకిల్‌ ఉండవచ్చు. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, ప్రయాణాలు, అనారోగ్యం, బరువులో మార్పులు వంటి కారణాల వల్ల అండాల విడుదల తేదీ మారవచ్చు. అందుకని ఎవరికి వారు మెన్‌స్ట్రువల్‌ క్యాలెండర్‌ని ఏర్పాటు చేసుకోవాలి.

ప్యాడ్స్‌ పడేయడమూ సమస్యే!
రుతుక్రమం సమయంలో శుభ్రత పాటించేవాళ్లు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ శానిటరీ ప్యాడ్స్‌ కొనుక్కోవాలనే అవగాహన ఉంది. కానీ, వాటిని ఎక్కడ పడేయాలో తెలియక, ఇంట్లో పిల్లలు ప్రశ్నిస్తారనో, ఎవరూ చూడకుండా చీకటిపడ్డాక తీసేద్దామని అలాగే ఉంచడం.. ఈ కారణాలతో రోజంతా ప్యాడ్స్‌లోనే ఉంటారు. కొందరు తక్కువ స్రావం అవుతుందని ప్యాడ్స్‌ ఖర్చు తగ్గించుకోవడానికి కూడా రోజంతా అలాగే వాడతారు. ప్రతి 4 నుంచి 8 గంటలలోపు ప్యాడ్‌ మార్చుకోవాలి. లేదంటే అలెర్జీ, ఇన్ఫెక్షన్‌ వస్తాయి. 

గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని వారికి మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్యాడ్స్‌ అందిస్తే వాడి పడేస్తారు. తిరిగి అడగరు. వారికై వారు కొనుగోలు చేయరు. సమస్య మళ్లీ మొదలవుతుంది. వారికి మెనుస్ట్రువల్‌ కప్స్‌ వాడకాన్నిప్రోత్సహిస్తే సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. పీరియడ్‌ సేఫ్‌ గురించి సరైన అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం. ఆరోగ్యంపై అవగాహన, శాస్త్రీయ సమాచారం, వైద్యుల సూచనలు ఉంటేనే మహిళలు తమ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మరింత సురక్షితంగా కాపాడుకోగలరు.

అవగాహన తప్పనిసరి..
పిల్లలు కావాలని డాక్టర్లను సంప్రదించేవారే తమ రుతుక్రమ సైకిల్‌ను శ్రద్ధగా పట్టించుకుంటున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం రుతుక్రమ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. స్కూల్‌కి వెళ్లే అమ్మాయిలకు తమ శరీరం గురించి, రుతుక్రమం సైకిల్‌ గురించి సరైన అవగాహన లేక΄ోవడం వల్ల గర్భధారణ, విచ్చిత్తి.. వంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. పీరియడ్స్‌ వచ్చిన అయిదవ రోజు నుంచి శరీరంలో జరిగే మార్పుల గురించి అమ్మాయిలకు చె΄్పాలి. ఈ విషయంలో టీచర్లు, తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 

– డాక్టర్‌ మనోరమ, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ల్యాప్రోస్కోపిక్‌ సర్జన్‌

సొంత నిర్ణయాలు వద్దు..
చాలా మంది నెలసరి సమయాలలో అధిక రక్తస్రావం, హార్మోన్లలో మార్పులు, రక్తహీనత, తీవ్రమైన నొప్పి.. వంటి సమస్యలెన్నో ఎదుర్కొంటుంటారు. ఇక గర్భధారణ లేదంటే గర్భం రాకూడదనుకునేవాళ్లు తమ సొంత నిర్ణయాలు అమలు చేస్తుంటారు. నెలసరి ఆలస్యం కావడానికి వాడే మాత్రలు, గర్భనిరోధక పద్ధతులు వైద్యుల సూచన మేరకే ఉపయోగించాలి. లేదంటే మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రతి మహిళ శరీరం భిన్నమైనది. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుల సలహా 
పాటించడం సురక్షితమైన మార్గం.

– డాక్టర్‌ శిరీషా రెడ్డి, గైనకాలజిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement