నేడు గ్లోబల్ ఎనర్జీ ఇండిపెండెన్స్ డే
ఉత్తర్ప్రదేశ్లోని మల్లిఖేడ గ్రామం. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని గ్రామాలలో ఇదొకటి. చాలామంది ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా డీజిల్ను ఎంచుకునేవారు. అయితే అది చాలా ఖరీదైన వ్యవహారం. ఆమె పేరు సుమన్. భర్త చిన్నపాటి ఉద్యోగమేదో చేస్తాడు. తక్కువ ఆదాయం కారణంగా, కుటుంబాన్ని పోషించడానికి ఒక చిన్నపాటి షాపు నిర్వహిస్తోంది సుమన్. డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు, ప్రింటింగ్, ఫొటో కాపీయింగ్, ఆధార్ అనుసంధాన సేవలను అందిస్తోంది. కరెంట్ సమస్య...నెత్తి మీద కత్తి!
కరెంట్ సమస్య వల్ల ఆమె షాప్ సరిగ్గా నడిచేది కాదు. రోజూ ఎంతోమంది కస్టమర్లు వచ్చినా, కరెంట్ లేకపోవడంతో వెనక్కి తిరిగి వెళ్లేవారు. అలాంటి రోజుల్లో ఒకరోజు...
ఊళ్లో జరిగిన గ్రామసభలో పాల్గొంది సుమన్. ఆ సభలో కరెంట్ కష్టాలను ఏకరువు పెట్టింది. ‘సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటే మీకు ఏ సమస్యా ఉండదు’ అని సూచించారు అధికారులు.
స్వయం సహాయక బృందాల నెట్వర్క్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తరువాత 1 కిలోవాట్ రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు లోన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అలా సోలార్ సిస్టమ్కు చేరువైంది. ఇప్పుడు ఆమెకు ఎలాంటి కరెంట్ కష్టాలు లేవు. సుమన్కు నెలవారీ ఆదాయం పెరిగింది. ఎలక్ట్రిసిటీ బిల్ భయపెట్టడం లేదు. ఎంతో కొంత డబ్బు పొదుపు చేయగలుగుతోంది.
త్రిబుల్ ఫ్రేమ్వర్క్
భారతదేశ ఇంధనరంగంలో మహిళల భాగస్వామ్యం 22 శాతమే. అయినప్పటికీ పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి ఆశాజనకమైన పరిస్థితి కనిపిస్తోంది. సౌర, పవన ఇంధనంతో పాటు ఇతర ఇంధనాలకు సంబంధించి సాంకేతిక కార్యక్రమాలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు.
‘మన దేశంలో పునరుత్పాదక శక్తి ఇంజినీరింగ్కు సంబంధించి ప్రత్యేక డిగ్రీ కోర్సు లేదు. మనం పూరించాల్సిన లోటు ఇది’ అంటున్నారు లూమినస్ పవర్ టెక్నాలజీ ఎండీ ప్రీతీ బజాజ్.
‘మహిళలకు ఇంధనరంగం గురించి అవగాహన కలిగించాలి. ఈ రంగంలో ఉండే అద్భుతమైన కెరీర్ అవకాశాలను గురించి వివరంగా తెలియజేయాలి’ అంటారు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్లో సీఎస్ఆర్ విభాగ అధిపతి భావన కృపాల్. ఇంధన రంగంలో మహిళలను ప్రోత్సహించడానికి 3 ఉ ఫ్రేమ్వర్క్ గురించి చెబుతున్నారు ప్రీతి బజాజ్.
ఫస్ట్ E–ఎంకరేజర్స్ ( ప్రోత్సాహకులు)
నాయకత్వ స్థానాల్లోకి మహిళలు అడుగు పెట్టడానికి ప్రేరేపించే, ప్రోత్సహించే వ్యక్తులు.
సెకండ్ E – ఎన్రిచర్స్
(సుసంపన్నం, సారవంతం చేయడం) మహిళల ప్రతిభను గుర్తించి వారి కెరీర్ పురోగతికి మార్గాలు చూపించే సీనియర్లు.
థర్డ్ E – ఎంగేజర్స్ (నిమగ్నపరిచేవారు)
తమకు ఉన్న విశ్వసనీయతను, ఇన్ఫ్లూయెన్స్ను ఉపయోగించి మహిళలకు మార్గనిర్దేశకత్వం చేస్తూ, వారికి అండగా ఉంటూ, ఉన్నతస్థానాలకు చేర్చడంలో తోడ్పడేవారు.
ప్రత్యామ్నాయాల దారిలో...
దశాబ్దాల కాలం నుంచి మన ఇంటి వంటకు ఎల్పీజీ వెన్నెముకగా ఉంది. అయితే పెరుగుతున్న ధరలు, సరఫరాకు సంబంధించిన సమస్యలు, పర్యావరణ అవగాహన కారణంగా చాలామంది గృహిణులు ఎల్పీజీకి ప్రత్యామ్నాయాలు అన్వేషించడం ప్రారంభించారు. ఎల్పీజీపై ఆధారపడడాన్ని తగ్గించగల ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించారు.
గృహిణులకు అత్యంత సులభంగా అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలలో ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్టాప్ ఒకటి. ఇండక్షన్ స్టవ్లు విద్యుదయస్కాంత శక్తిని ఉపయోగించి పాత్రలను నేరుగా వేడి చేస్తాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేని పట్టణాలలో ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి.
మోడ్రన్ ఇండక్షన్ కుక్టాప్లు భారతీయ వంటకాల కోసం ముందుగా సెట్ చేసిన మెనూలతో వస్తున్నాయి. దీని వల్ల సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వారికి కూడా వీటిని ఉపయోగించడం సులభం అవుతుంది. అమెరికా– ఇరాన్ యుద్ధ నేపథ్యంలో పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఆధునిక, పురాతన సంప్రదాయ పద్ధతులను ప్రజలు అనుసరించారు.
అవసరంలో ఉన్నప్పుడు ఆవిష్కరణ పుడుతుంది అంటారు. నిన్నామొన్నటి ఎల్పీజీ సిలిండర్ల సంక్షోభం నేపథ్యంలో ఆ మాట మరోసారి గుర్తుకు వస్తుంది. యుద్ధం రెండు దేశాల మధ్య జరిగిందా? రెండు దేశాలు కలిసి సామాన్యులపై చేశాయా? అనేది అంతుచిక్కని జవాబు. యుద్ధం వల్ల ఎల్పీజీ సంక్షోభం ఒక కోణం అయితే, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వెదుక్కోవడం, పాత పద్ధతుల్లోకి తిరిగి వెళ్లడం మరో కోణం. ప్రత్నామ్నాయ ఇంధన వనరుల విషయంలో మహిళలు ముందున్నారు. ఎనర్జిటిక్గా ముందుకు వెళుతున్నారు..


