అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్ల అయోధ్య ట్రస్ట్ ఖాతాలను రీ-ఆడిట్ చేయనుంది. విచారణలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. నిర్మాణ సంబంధిత వ్యయాలతో పాటు.. విరాళంగా వచ్చిన ఆభరణాలు, ఇతర బంగారం, వెండి వస్తువులను కూడా ఈ రీ-ఆడిట్లో పరిశీలించనున్నట్లు సిట్ పేర్కొంది. గత ఐదేళ్ల కాలానికి సంబంధించిన ట్రస్ట్ ఆర్థిక రికార్డులను సిట్ సమగ్రంగా పరిశీలించనుంది.
మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన అవినాష్ శుక్లాను అయోధ్య పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విరాళాల లెక్కింపు విధుల్లో ఉన్న శుక్లాను ఈ కేసులో ముందుగానే అరెస్టు చేయగా.. స్థానిక న్యాయస్థానం గురువారం అతడికి 24 గంటల పాటు పోలీస్ కస్టడీ విధించింది. ఇప్పటివరకు ఈ కేసులో అత్యధిక నగదు ఇతని వద్ద నుంచే స్వాధీనం చేసుకున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. సిట్ అధికారులు ఇప్పటివరకు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా, ఆలయ నిర్మాణ, నిర్వహణ వ్యవహారాలతో సంబంధం ఉన్న గోపాల్ రావులను విచారించారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామాలు సమర్పించగా.. జూలై 6న జరగనున్న ట్రస్ట్ సమావేశంలో వారి రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటివరకు ఈ కేసులో అవినాష్ శుక్లా నుంచి రూ. 20.39 లక్షలు, కరుణేష్ పాండే నుంచి రూ.18.07 లక్షలు, అనుకుల్ప్ మిశ్రా నుంచి రూ.16.82 లక్షలు, లవకుష్ మిశ్రా నుంచి రూ.14.25 లక్షలు, రమాశంకర్ మిశ్రా నుంచి రూ.7.32 లక్షలు, రమాశంకర్ యాదవ్ నుంచి రూ.1 లక్ష స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సుమారు 11 గ్రాముల బంగారం, 375 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.
రామ మందిరంలో చోరీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. రామ మందిరంలో విరాళాల చోరీ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని.. ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే అన్నారు. ఈ ఘటన మమ్మల్ని కలిచివేసింది. ఈ ఘటన పైన దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులకు దోషులు తేలిన వారిపై కఠిన శిక్షలు విధించాలి. ఈ ఘటనకు కారణమైన వ్యవస్థగత లోపాలను వెంటనే సరిదిద్దాలి. అలాగైతేనే భక్తుల విశ్వాసాలు కొనసాగుతాయి. పారదర్శక విధానాలను అనుసరించి ధార్మిక వాతావరణాన్ని మరింత పెంచేలా పనిచేయాలి. ఈ సంక్లిష్ట సమయంలో హిందువులందరూ సంయమనంతో వ్యవహరించాలి. ఈ ఘటనను స్వార్ధ ప్రయోజనాలకు ఉపయోగించుకుని.. హిందూ ధర్మంపై బురదజల్లే ప్రయత్నాలకు అడ్డు కట్టవేయాలి’’ అని దత్తాత్రేయ హోసబలే పేర్కొన్నారు.


