భారతీయ పౌరసత్వ నిరూపణ పత్రాలకు సంబంధించి తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో గౌహతి హైకోర్టు తీర్పు సంచలనంగా మారింది. తాజా చారిత్రాత్మక తీర్పులో, గౌహతి హైకోర్టు ఒక రిట్ పిటిషన్పై విచారణ జరుపుతూ, పిటిషనర్ తన పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి 16 పత్రాలను సమర్పించినప్పటికీ, తాను భారత పౌరుడినని నిరూపించుకోలేకపోయారని పేర్కొంది.జస్టిస్ కల్యాణ్ రాయ్ సురానా, జస్టిస్ షమీమా జహాన్ లతో కూడిన ధర్మాసనం జూన్ 30న ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
ఒక రిట్ పిటిషన్ను విచారించిన గౌహతి హైకోర్టు ఈ కీలక తీర్పునిచ్చింది. పిటిషనర్ తన పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి 16 పత్రాలను కోర్టుకు సమర్పించినప్పటికీ, తాను భారతీయ పౌరుడినని నిరూపించడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. ఫారినర్స్ యాక్ట్, 1964 లోని సెక్షన్ 9 ప్రకారం... పిటిషనర్ సమర్పించిన 16 పత్రాలు అతను విదేశీయుడు కాదని, భారతీయ పౌరుడేనని నిరూపించడానికి ఎంతమాత్రం సహాయపడటం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఒక వ్యక్తి విదేశీయుడా కాదా అనే ప్రశ్న తలెత్తినప్పుడు, తాను భారతీయ పౌరుడినని నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఆ వ్యక్తిపైనే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
కేసు నేపథ్యం
గౌహతికి చెందిన అమీనుల్ హక్ అనే వ్యక్తి, తనను విదేశీయుడిగా ప్రకటిస్తూ ఫారినర్స్ ట్రిబ్యునల్ 2019 ఫిబ్రవరి 28న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబం తరతరాలుగా అసోంలోనే నివసిస్తోందని ఆయన వాదించారు.
పిటిషనర్ సమర్పించిన 16 పత్రాలు
1951 నాటి జాతీయ పౌర పట్టిక (NRC) ప్రతులు (ఇందులో అతని తాత, తండ్రి పేర్లు ఉన్నాయి).
1966 నుండి 2017 వరకు తన తల్లిదండ్రుల మరియు తన పేరు ఉన్న ఓటర్ల జాబితాల ధృవీకృత ప్రతులు.
1973 నాటి భూమి కొనుగోలు పత్రాలు.
పాన్ కార్డ్ (PAN).
ఓటరు గుర్తింపు కార్డులు (Voter IDs).
స్కూల్ సర్టిఫికేట్.
అంతేకాదు తండ్రి సాక్ష్యం సరిపోదని కూడా తెలిపింది. పిటిషనర్ తండ్రి స్వయంగా కోర్టుకు హాజరై అమీనుల్ హక్ తన కుమారుడేనని గుర్తించారు. అయితే, సరైన రాతపూర్వక/డాక్యుమెంటరీ ఆధారాలు లేకుండా కేవలం నోటి మాటల ద్వారా చెప్పే సాక్ష్యం ఇద్దరి మధ్య బంధాన్ని నిరూపించడానికి సరిపోదని కోర్టు పేర్కొంది.
పిటిషనర్ తండ్రి పేరు వేర్వేరు పత్రాల్లో మొహీరుద్దీన్ షేక్, మహ్రుద్దీన్ షేక్, మొహీరుద్దీన్, మోహిర్ ఉద్దీన్ అని వేర్వేరు స్పెల్లింగులతో ఉంది. ఈ తప్పులను కోర్టు పెద్దగా పరిగణించనప్పటికీ... పిటిషనర్ కుటుంబం దోబాకురా, ఘుగుదోబా, హష్దోబా అనే మూడు గ్రామాల్లో నిరంతరంగా కలిసి ఉన్నట్లు ఓటర్ల జాబితా ద్వారా నిరూపించడంలో విఫలమయ్యారని కోర్టు తెలిపింది. ఈ మూడు గ్రామాల ఓటర్ల జాబితాలన్నింటిలో పిటిషనర్తో పాటు కుటుంబంలోని సభ్యులుగా చూపబడిన పాసన్ అలీ, మోహిరుద్దీన్ లేదా అమీనుల్ హోక్ పత్రాల్లోని ఖాళీలను పూరించడానికే ఓటర్ల జాబితాలను వాడుకున్నారని, కుటుంబం ఒక గ్రామం నుండి మరో గ్రామానికి మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.
స్కూల్ సర్టిఫికేట్ చెల్లదు: హష్దోబా ఆంచలిక్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు 2017లో ఇచ్చిన స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ను పిటిషనర్ సమర్పించారు (అతను 1999లో పాఠశాల వదిలి వెళ్ళినట్లు అందులో ఉంది). అయితే, ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తి (హెడ్మాస్టర్) కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పనందున దానికి విలువ లేదని కోర్టు తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ


