వాషింగ్టన్: అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్పై ట్రంప్ మరోసారి బాంబు పేల్చారు. ఆ దేశంలోకి వచ్చే శత్రుదేశాల పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలో జన్మించడంతో వచ్చే ఆటోమెటిక్ పౌరసత్వ నిబంధనపై సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. బర్త్ టూరిజంపై ఇటీవలే అక్కడి సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కొద్ది వారాల్లోనే మరోసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.
ట్రంప్ మాట్లాడుతూ.. శత్రుదేశాల పౌరులు, విదేశీ ఉగ్రవాద సంస్థల సభ్యుల పిల్లలు మోసపూరిత మార్గాల్లో వీసాలు పొందిన వారి పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ బానిసల పిల్లల కోసమని ప్రస్తుతం దీనిని కొంతమంది వ్యాపారంగా మార్చుకున్నారని ట్రంప్ విమర్శించారు.
ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ నేపథ్యంలో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా రాజ్యాంగ హక్కులను మార్చలేరని ఈ ఆదేశాలను కూడా కోర్టులో సవాలు చేస్తామని పేర్కొంది.
ట్రంప్ తెచ్చిన నూతన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్
1. మొదటి ఆర్డర్ : ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమెరికాలో పుట్టే పిల్లలకు ఆటోమేటిక్గా లభించే పౌరసత్వం విషయంలో కొన్ని నిర్దిష్ట వర్గాలను అనర్హులుగా చేర్చారు. శత్రు దేశాల వ్యక్తులు, ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు విదేశీ ప్రభుత్వాల తరఫున లాబీయింగ్ చేసేవారు లేదా ఆ దేశాల కోసం పనిచేసే వ్యక్తులు
2. రెండవ ఆర్డర్ (బర్త్ టూరిజంపై పూర్తి నిషేదం: అమెరికా పౌరసత్వాన్ని (పాస్పోర్ట్ను) సంపాదించడం కోసమే టూరిస్ట్ వీసాలపై అమెరికాకు వచ్చి పిల్లలను కనే అక్రమ పద్ధతిని అరికట్టడానికి ఈ ఆర్డర్ తెచ్చారు. విదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు/కాన్సులేట్లలోని వీసా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా గర్భిణీలు కేవలం అమెరికాలో ప్రసవించి పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో (మోసపూరితంగా లేదా తప్పుడు సమాచారంతో) వీసా కోరితే, అటువంటి వారి వీసాలను తిరస్కరించాలని ఈ ఆర్డర్ నిర్దేశిస్తుంది.
సుప్రీంకోర్టు తీర్పు
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికా గడ్డపై జన్మించే ప్రతి ఒక్కరికీ (అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాలపై ఉన్నవారి పిల్లలతో సహా) ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత (జనవరి 2025లో) బర్త్రైట్ సిటిజెన్షిప్ను నిరోధిస్తూ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను 6-3 మెజారిటీతో సుప్రీంకోర్టు కొట్టివేసింది. పౌరసత్వ నిబంధనలను మార్చాలంటే అధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు సరిపోవని, రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని కోర్టు తేల్చిచెప్పింది. ఆ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.


