నారాయణపేట: తేళ్లను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. కానీ రాష్ట్ర సరిహద్దులోని యాద్గీర్ జిల్లా గురిమిట్కల్ మండలం కందుకూరులో మాత్రం తేళ్లనే దైవ స్వరూపంగా కొలుస్తారు.
సోమవారం దేశమంతటా నాగుల పంచమి పర్వదినం నిర్వహించుకోగా.. కందుకూరులో తేళ్ల పంచమిని (Tella Panchami) వైభవంగా జరుపుకొన్నారు.
తరతరాలుగా వస్తున్న ఈ విశ్వాసం.. నాగపంచమి రోజున కొండమాయి కొండపై మరోసారి భక్తి వైభవాన్ని ఆవిష్కరించింది.
కందుకూరు కొండమవ్వ జాతర సందర్భంగా భక్తులు భారీగా కొండపైకి చేరుకున్నారు. కొండమవ్వకు ప్రత్యేక పూజల అనంతరం గుట్టపై రాళ్లను తొలగిస్తూ తేళ్లను పట్టుకున్నారు.
చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా భక్తులు తేళ్లను చేతుల్లో పట్టుకుని భక్తి పారవశ్యంతో ఉప్పొంగారు. కొందరు చిన్నారులు సైతం తేళ్లను పట్టుకుని ఆడుకోవడం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జాతర రోజున తేళ్లు కుట్టవని.. కొండమాయి అమ్మవారి కృపతో వాటితో ఎలాంటి హాని జరగదని భక్తులు విశ్వసిస్తున్నారు.
తేలు కుట్టినప్పుడు అమ్మవారి బండారం లేదా కుంకుమ రాస్తే నొప్పి తగ్గుతుందనే నమ్మకం కూడా ఉంది.
అయితే ఇవి భక్తుల విశ్వాసాలే తప్ప.. వైద్యపరమైన చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని వైద్యసిబ్బంది స్పష్టం చేస్తున్నారు. తేలు కుట్టిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
తేలు కాటు ఘటనలు గతంలో చోటుచేసుకున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.


