ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, పాన్ కార్డ్, బ్యాంకు ఖాతా పుస్తకం వంటి పత్రాలు కేవలం వ్యక్తిగత గుర్తింపునకు లేదా ప్రభుత్వ సేవలు పొందడానికే పరిమితమని, అవి భారత పౌరసత్వానికి నిర్దిష్ట నిరూపణలు (కన్క్లూజివ్ ప్రూఫ్) కావని కోల్కతా హైకోర్టు తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్ పౌరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ డిటెన్షన్ సెంటర్లో ఉన్న ఓ వ్యక్తి పౌరసత్వ వివాదానికి సంబంధించిన పిటిషన్ను విచారించిన జస్టిస్ దేబాంగ్షు బసాక్, జస్టిస్ మహమ్మద్ షబ్బర్ రషీదీలతో కూడిన ధర్మాసనం ఈ స్పష్టత ఇచ్చింది.
కేసు నేపథ్యం.. విచారణ ముఖ్యాంశాలు
ముర్షిదాబాద్ ప్రాంతానికి చెందినవాడిగా భావిస్తున్న నాసిర్ అనే వ్యక్తి విదేశీయుడనే అనుమానంతో లాల్గోలా డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. తాను భారతీయ పౌరుడినేనని నిరూపించుకోవడానికి ఆయన తరఫున ఓటరు ఐడీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్బుక్లను కోర్టుకు సమర్పించారు. అయితే, విచారణలో ఆయన వెల్లడించిన వివరాల్లో వ్యత్యాసాలు, అస్పష్టత ఉన్నట్లు ధర్మాసనం గుర్తించింది. విదేశీయుల చట్టం (ఫారెనర్స్ యాక్ట్, 1946) సెక్షన్ 9 ప్రకారం.. ఒక వ్యక్తి తాను విదేశీయుడు కాదని నిరూపించుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత ఆ వ్యక్తిపైనే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
‘ఓటరు గుర్తింపు కార్డు అనేది ఓటర్ల జాబితాలో సదరు వ్యక్తి పేరు నమోదుకు సాక్ష్యమే తప్ప పౌరసత్వాన్ని ధ్రువీకరించదు. ఆధార్, పాన్ కార్డ్ ప్రభుత్వ సేవలు పొందడానికి, పన్ను సంబంధిత గుర్తింపునకు ఉద్దేశించిన సాధనాలు మాత్రమే. వీటి ఆధారంగా పౌరసత్వాన్ని పొందలేరు. పౌరసత్వ చట్టం 1955 ప్రకారం భారతదేశంలో పౌరసత్వ నిర్ణయాలకు సిటిజన్షిప్ యాక్ట్, 1955 ప్రధాన ప్రాతిపదిక. అందులోని చట్టబద్ధ నిబంధనలను సాధారణ సేవా గుర్తింపు కార్డులు అధిగమించలేవు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
కస్టడీలో ఉన్నప్పుడు సమర్పించిన పత్రాలు, ఇచ్చిన వాంగ్మూలాల్లో పొంతన లేకపోవడంతో పిటిషనర్ కోరికను నిరాకరిస్తూ హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. అక్రమ చొరబాట్లు, గుర్తింపు పత్రాల దుర్వినియోగం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో పౌరసత్వ చట్ట నిబంధనలకు, సాధారణ గుర్తింపు కార్డులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చట్టపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే..
భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే కేవలం సాధారణ గుర్తింపు కార్డులు సరిపోవని ‘పౌరసత్వ చట్టం, 1955’ ప్రకారం నిర్దిష్టమైన, చట్టబద్ధమైన ధ్రువపత్రాలు అవసరమవుతాయని న్యాయస్థానాలు, హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేశాయి.
పాస్పోర్ట్: భారత ప్రభుత్వం జారీ చేసే విదేశీ ప్రయాణ పాస్పోర్ట్ అనేది విదేశాల్లో, దేశంలో పౌరసత్వానికి అత్యంత బలమైన ప్రాథమిక ఆధారం.
పౌరసత్వ గుర్తింపు పత్రం: విదేశాల నుంచి వచ్చి భారత పౌరసత్వం పొందిన వారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక పౌరసత్వ పత్రం.
బర్త్ సర్టిఫికేట్: మున్సిపాలిటీ, పంచాయతీ లేదా ప్రభుత్వ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పొందిన అధికారిక జనన ధ్రువీకరణ పత్రం.
తల్లిదండ్రుల పౌరసత్వ ఆధారాలు: 1987 జులై 1కి ముందు భారతదేశంలో జన్మించిన వారికి తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రం సరిపోతుంది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబరు 3 మధ్య జన్మిస్తే అభ్యర్థి జనన ధ్రువీకరణ పత్రంతో పాటు తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరు ఆ సమయానికి భారతీయ పౌరుడని నిరూపించే పత్రాలు ఉండాలి. 2004 డిసెంబరు 3 తర్వాత జన్మిస్తే తల్లిదండ్రులిద్దరూ భారతీయ పౌరులై ఉండాలి.
ఇతర పత్రాలు
జనన ఆధారాలు స్పష్టంగా లేనప్పుడు కొన్ని ప్రభుత్వ పత్రాలు పౌరసత్వ విచారణల్లో సహాయపడతాయి. తరాల నుంచి భారతదేశంలో నివసిస్తున్నట్లు చూపే పాత ఆస్తి లేదా రెవెన్యూ రికార్డులు. పుట్టిన తేదీ, ప్రదేశం నమోదై ఉన్న పాత విద్యా అర్హత పత్రాలు. పూర్వీకులు భారతదేశంలో నివసించారని నిరూపించే ప్రభుత్వ గుర్తింపు పొందిన రికార్డులు ఉండాలి.
ఇదీ చదవండి: వసివాడిన పసిడి మెరుపులు


