చైనా మొబైల్ యాప్లపై ఢిల్లీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఢిల్లీలో ఈ-రిక్షాలను రిమోట్ ద్వారా ఆపేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న రెండు మొబైల్ యాప్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిని గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశించింది. యాప్లోని 'డిశ్చార్జ్ స్విచ్' (Discharge Switch) పై ఒక్కసారి క్లిక్ చేయగానే, నడుస్తున్న వాహనం ఉన్నట్టుండి రోడ్డు మధ్యలోనే అకస్మాత్తుగా ఆగిపోతుండటంతో ఈ-రిక్షా డ్రైవర్లు తీవ్ర గందరగోళానికి, ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ యాప్లపై కఠిన చర్యలు తీసుకుంది.
ఢిల్లీలో నడుస్తున్న ఈ-రిక్షాలను (స్థానికంగా 'తిర్రి' అని పిలుస్తారు) కొందరు వ్యక్తులు మొబైల్ యాప్ల ద్వారా రిమోట్గా ఆఫ్ చేస్తూ డ్రైవర్లను వేధిస్తున్నారు. ఈ దుర్మార్గానికి అడ్డుకట్ట వేస్తూ, కేంద్ర ప్రభుత్వం BAT BMS, Epoch Li-ion అనే రెండు మొబైల్ అప్లికేషన్లను గూగుల్ ప్లే స్టోర్ (Android Play Store), ఆపిల్ యాప్ స్టోర్ (Apple App Store) ల నుండి తక్షణమే తొలగించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: Citizenship16 పత్రాలిచ్చినా; సిటిజెన్షిప్పై గౌహతి కోర్టు సంచలన తీర్పు
భారత ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) కార్యదర్శి ఎస్. కృష్ణన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. నిన్ననే ఈ యాప్ల వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, వెంటనే వాటిని యాప్ స్టోర్ల నుండి తొలగించామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి హానికరమైన యాప్లు అందుబాటులోకి రాకుండా యాప్ స్టోర్ల యాజమాన్యాలతో మాట్లాడతామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ
అసలేంటీ యాప్స్
BAT BMS, Epoch Li-ion అనేవి నిజానికి లిథియం-అయాన్ (Lithium-ion) బ్యాటరీలను పర్యవేక్షించే బ్యాటరీ మేనేజ్మెంట్ యాప్లు. ఇవి బ్లూటూత్ (Bluetooth) ద్వారా బ్యాటరీకి కనెక్ట్ అయ్యి,బ్యాటరీ వోల్టేజ్, ఉష్ణోగ్రత, కరెంట్ వంటి వివరాలను రియల్ టైమ్లో చూపిస్తాయి. అలాగే, బ్యాటరీని రిమోట్గా షట్డౌన్ (ఆఫ్) చేసే సదుపాయం కూడా ఇందులో ఉంటుంది. ఈ చైనా స్మార్ట్ఫోన్ అప్లికేషన్లలో భద్రతకు సంబంధించిన పెద్ద లోపం ఉంది. ఈ యాప్ల ద్వారా బ్యాటరీకి కనెక్ట్ అవ్వడానికి ఎలాంటి పాస్వర్డ్ లేదా అథెంటికేషన్ (Authentication) అవసరం లేదు. దీనిని కొందరు ఆకతాయిలు ఒక "ప్రాంక్" లా వాడుతున్నారు.
రోడ్డుపై ఈ-రిక్షా వెళ్తున్నప్పుడు, ఆకతాయిలు తమ ఫోన్లో ఈ యాప్ ఓపెన్ చేస్తారు.బ్లూటూత్ ద్వారా దగ్గర్లోని ఈ-రిక్షా బ్యాటరీకి కనెక్ట్ అయ్యి, 'డిశ్చార్జ్ స్విచ్' క్లిక్ చేయగానే సదరు వాహనం రోడ్డు మధ్యలో అకస్మాత్తుగా ఆగిపోతుంది. దీంతో కారు లేదా బైక్ వెనుక ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే వారు హారన్లు కొడుతూ గొడవకు దిగుతున్నారు. ఆకతాయిలు మళ్లీ అదే యాప్ ద్వారా బ్యాటరీని ఆన్ చేసే వరకు ఆ ఈ-రిక్షా స్టార్ట్ కాదు. ఈ-రిక్షా డ్రైవర్లకు ఇది ఒక పెద్ద ఇబ్బందిగా మారింది.
ఇదీ చదవండి: టోల్గేట్పై దూసుకొచ్చిన ఎల్పీజీ ట్యాంకర్ : నలుగురు మృతి


