అమర్‌నాథ్ యాత్రకు.. ఇలా వెళ్లాలి..! | Devotion: How to Reach Amarnath: A Complete Yatra Guide | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్ యాత్రకు.. ఇలా వెళ్లాలి..!

Jul 3 2026 5:20 PM | Updated on Jul 3 2026 5:31 PM

Devotion: How to Reach Amarnath: A Complete Yatra Guide

ప్రకృతి నడిబొడ్డున, హిమాలయాల గుండెల్లో వెలిసిన ఆ పరమశివుని సాక్షాత్కారం.. అమర్‌నాథ్ యాత్రకు సమయం ఆసన్నమైంది!. మంచు లింగ రూపంలో దర్శనమిచ్చే ఆ జ్యోతిర్లింగాన్ని కళ్లారా చూడాలని, జన్మ ధన్యం చేసుకోవాలని దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది యాత్ర జూలై 3వ తేదీ నుంచి ప్రారంభమై.. ఆగస్టు 28వ తేదీ వరకు, అంటే మొత్తం 57 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. 

శ్రీ అమర్‌నాథ్‌జీ ష్రైన్ బోర్డు ప్రకటన ప్రకారం.. ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కానీ.. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తున, మైనస్ డిగ్రీల చలిలో, ఆక్సిజన్ కూడా సరిగ్గా అందని కొండదారుల్లో సాగే ఈ ప్రయాణం.. భక్తితో పాటు ఒక పెద్ద సాహసమే..! ముఖ్యంగా మొదటిసారి వెళ్లేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు అమర్‌నాథ్ యాత్రకు ఉన్న రెండు మార్గాల రహస్యం ఏంటి?  వంటి వివరాల గురించి సవివరంగా తెలుసుకుందాం.

పర్మిట్ లేకపోతే నో ఎంట్రీ! 
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి సూత్రం.. రిజిస్ట్రేషన్ అండ్ పర్మిట్. చెల్లుబాటు అయ్యే యాత్రా పర్మిట్ లేకుండా.. Shrine బోర్డు ఎవరినీ కూడా ఒక్క అడుగు ముందుకు వేయనివ్వదు. ఆఖరి నిమిషం వరకు ఆగకుండా, కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారానే మీ స్లాట్‌లను బుక్ చేసుకోవాలి. మీ పర్మిట్ పత్రాలను ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.

ఆరోగ్య పరీక్ష
ఈ యాత్రలో అత్యంత కీలకమైంది ఆరోగ్య పరీక్ష. ఈ యాత్ర సముద్ర మట్టానికి 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో సాగుతుంది. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఆథరైజ్డ్ డాక్టర్ల నుంచి కంపల్సరీగా హెల్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. 

ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా, బీపీ ఉన్నవారు వైద్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాతే యాత్రకు సిద్ధమవ్వాలి. యాత్రకు రెండు వారాల ముందు నుంచే రోజుకు 40 నిమిషాలు నడక, యోగా అలవాటు చేసుకుంటే కొండల్లో నడవడం చాలా సులభం అవుతుంది.

పహల్గాం, బాల్టాల్ మార్గాలు..
అమర్‌నాథ్ గుహను చేరుకోవడానికి భక్తులకు రెండు ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది.. పహల్గాం మార్గం. ఇది కొంచెం దూరంగా ఉన్నప్పటికీ.. ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. ఈ మార్గంలో ఎత్తు అనేది క్రమక్రమంగా పెరుగుతుంది కాబట్టి, మన శరీరం అక్కడి వాతావరణానికి, ఆక్సిజన్ స్థాయిలకి దశలవారీగా అలవాటు పడుతుంది. 

అందుకే మొదటిసారి యాత్రకు వెళ్లేవారికి ఈ మార్గమే బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఇక రెండోది.. బాల్టాల్ మార్గం. తక్కువ సమయంలో, కేవలం ఒకే రోజులో దర్శనం పూర్తి చేసుకొని తిరిగి రావాలనుకునేవారికి ఇది అనుకూలమైనది. కానీ.. ఈ మార్గంలో కొండలు చాలా నిటారుగా, ప్రమాదకరంగా ఉంటాయి. శారీరకంగా, మానసికంగా వంద శాతం ఫిట్‌నెస్ ఉన్నవారు మాత్రమే బాల్టాల్ రూట్‌ను తట్టుకోగలరు.

హిమాలయాల వెదర్ 
హిమాలయాల్లో వాతావరణం ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎండ కాస్తుందో, ఎప్పుడు మంచు తుఫాన్ వస్తుందో ఊహించడం అసాధ్యం. అందుకే వాతావరణాన్ని అస్సలు తేలికగా తీసుకోవద్దు. మీ బ్యాగ్‌లో థర్మల్ ఇన్సల్స్, వెచ్చని జాకెట్, వాటర్‌ప్రూఫ్ రెయిన్‌కోట్, ఉన్ని టోపీ, గ్లవుజులు, గట్టి గ్రిప్ ఉండే ట్రెక్కింగ్ షూస్ తప్పనిసరిగా ఉండాలి. 

ఇక మీ ట్రావెల్ బ్యాగ్‌ని ఎంత వీలైతే అంత లైట్ వెయిట్‌గా ఉంచుకోవడం మంచిది. అత్యవసర వస్తువులైన.. ఆధార్ కార్డ్, యాత్రా పర్మిట్, పవర్ బ్యాంక్, టార్చ్ లైట్, వాటర్ బాటిల్, ఇన్‌స్టంట్ ఎనర్జీని అందజేసే డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ బార్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, రోజువారీ మందులు, హ్యాండ్ శానిటైజర్ మాత్రమే వెంట తీసుకెళ్లాలి.

తొందరపాటు వద్దు.. ప్రాణమే ముఖ్యం!
అమర్‌నాథ్ దారిలో వేగంగా వెళ్లాలనే తొందరపాటు అస్సలు పనికిరాదు. శ్వాస తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది అనిపించినా, తల తిరిగినా, తలనొప్పి వచ్చినా.. ఏమాత్రం మొహమాటపడకుండా దారి పొడవునా ఉండే మెడికల్ క్యాంపుల వద్దకు వెళ్లి వైద్య బృందాన్ని సంప్రదించాలి. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలతో వచ్చేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. 

నడవలేని భక్తుల కోసం అక్కడ నిర్ణీత రుసుముతో పోనీ, డోలీ సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే సమయం లేనివారి కోసం హెలికాప్టర్ సర్వీసులు కూడా ఉన్నాయి. యాత్ర పొడవునా నున్వాన్, బాల్టాల్, శేషనాగ్, పంచతరణి బేస్ క్యాంపుల వద్ద తాత్కాలిక టెంట్లు, లంగర్లలో ఉచిత భోజనం, తాగునీటి సౌకర్యం లభిస్తుంది. మన ఇండియన్ ఆర్మీ, పారామిలటరీ బలగాలు అడుగడుగునా భక్తులకు రక్షణగా పహారా కాస్తూనే ఉంటాయి.

అవును.. అమర్‌నాథ్ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు.. అది ఒక ఆధ్యాత్మిక సాధన. Shrine Board చెప్పిన నిబంధనలు పాటిస్తూ.. సరైన ప్రణాళిక, ఆరోగ్య జాగ్రత్తలతో ముందడుగు వేస్తే.. ఆ భోలానాథుడి పవిత్ర దర్శనం యాత్రికుల జీవితంలో ఒక మధురానుభూతిగా మిగిలిపోవడం ఖాయం.

(చదవండి: 'వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు..! రథయాత్ర ఎ‍ప్పుడంటే..)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement