‘నా చేతిలో కెమెరా ఉంటే భయమనేది ఉండదు’ అంటారు ఒక ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్. గతం సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు కెమెరా అనేది సాధనం కాదు. సరికొత్త ఆయుధం. ‘ఫొటోగ్రాఫర్స్ అంటే పురుషులు మాత్రమే’ అనుకునే రోజుల్లో... ‘ఫొటోగ్రాఫర్ అమ్మ’గా పేరు తెచ్చుకున్న నాటి అన్నపూర్ణ దత్తా నుంచి... ‘కెమెరాతో అందమైన ఫొటోలు తీయడమే కాదు ప్రకృతిని ప్రమాదాల నుంచి రక్షించుకోవాలి’ అంటున్న నేటి రాధికా రామస్వామి వరకు ఎంతోమంది మహిళలు లెన్స్కు కొత్త అందాన్ని తెస్తున్నారు. ఫొటోగ్రఫీకి సామాజిక స్పృహ జోడిస్తున్నారు...
స్టూడియో ఫొటోగ్రఫీ అనేది పురుషుల ఆధిపత్యంలో ఉన్న వృత్తిగా కొనసాగుతున్న రోజుల్లో సామాజిక కట్టుబాట్లను సవాలు చేస్తూ కెమెరా చేతబూని మార్గదర్శకురాలిగా నిలిచారు అన్నపూర్ణ దత్తా. అవిభక్త బెంగాల్లో జన్మించిన దత్తా ఆ కాలంలోని తొలితరం మహిళా ఫొటోగ్రాఫర్లలో ఒకరిగా నిలిచి కొత్త ఒరవడి సృష్టించారు. 1920 దశకంలో ఫొటోగ్రాఫర్గా దత్తా ప్రతిభ వెలుగులోకి వచ్చింది. రాజకీయ నాయకుల నుంచి గాయకుల వరకు ఆనాటి ఎంతోమంది ప్రముఖుల ఫొటోలు తీశారు దత్తా. దత్తా ఫొటోలలో ఆమె సెల్ఫ్΄ోర్ట్రయిట్ బాగా పాపులర్ అయింది. ఈ ఫొటోలో ఆమె తన ప్లేట్ కెమెరా పక్కన కనిపిస్తారు.
ఫొటోగ్రాఫర్ మాషిమా
లెన్స్ క్యాప్ పట్టుకొని కెమెరాకు అవతలి వైపు చూస్తున్న అన్నపూర్ణ దత్తా కళ్లలో తన వృత్తిపై అమితమైన అభిరుచి, ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. సంప్రదాయ గృహజీవిత కట్టుబాట్లకు కట్టుబడి ఉంటూనే తనకు ఇష్టమైన వృత్తిలో విజయవంతం అయ్యారు. ఫొటోలను స్వయంగా డెవలప్ చేసి ప్రింట్స్ వేసేవారు. ఆమెను అందరూ ఫొటోగ్రాఫర్ మాషిమా అని పిలిచేవారు. బెంగాలీలో మాషిమా అంటే తల్లి అని అర్థం. ఎనభై రెండు సంవత్సరాల వయసులో అన్నపూర్ణ దత్తా కన్నుమూశారు. తొలితరం మహిళా ఫొటోగ్రాఫర్లైన జ్ఞానదానందినిదేవి, సరోజిని ఘోష్, చంచలబాల దాసి, మీరా చౌధురి, ఇందిరాదేవిలతోపాటు అన్నపూర్ణాదేవి చేసిన కృషి ఎన్నోతరాల మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది.
ప్రజలతో మమేకం అయ్యేలా...
కోవిడ్–19పై కవరేజికిగానూ ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ పురస్కారం గెలుచుకున్న కశ్మీర్కు చెందిన సన్నా ఇర్షాద్ మట్టు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. సన్నా ఇర్షాద్ ఫొటో జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్. ఆమె డాక్యుమెంటరీ–స్టైల్ ఫొటోలు నిశ్శబ్దంగా కనిపిస్తూనే కఠినమైన వాస్తవాలను ప్రకటిస్తాయి. ‘ఫొటోజర్నలిజంలో ఎక్కువమంది మహిళా ఫొటోజర్నలిస్ట్లను చేను చూడలేదు. సామాజిక ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఆ సంఘటనలను కవర్ చేయడానికి వెళ్లినప్పుడు నన్ను ఆశ్చర్యంగా చూసేవారు. దీనికి కారణం ఎక్కువమంది ఫొటోజర్నలిస్ట్లు పురుషులు కావడమే. వెలుగులోకి రాని కథలను అన్వేషించి డాక్యుమెంట్ చేయడం ఫొటోగ్రాఫర్గా నా బాధ్యత. నేను తీసే ఫొటోలతో ప్రజలు మమేకం అయ్యేలా చేయడం నా లక్ష్యం. సామాజిక వాస్తవాలను వెలుగులోకి తెచ్చి ఫొటోగ్రాఫీలో రాణించడానికి సంకల్ప బలం అవసరం’ అంటున్నారు సన్నా ఇర్షాద్.
ఫస్ట్ ఫిమేల్ వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ మన దేశంలో ఫస్ట్ ఫిమేల్ వైల్డ్లైఫ్ ఫోటో
గ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్నారు రాధిక రామస్వామి. హైస్కూల్ రోజుల్లోనే ‘కెమెరా’ అనే ఫ్రెండ్తో పరిచయం అయింది. ఆ స్నేహం కాలంతో పాటు విస్తరించింది. ‘ఫొటోగ్రఫీకి సంబంధించి సాంకేతికత మారింది. అడవిలో ఫిల్మ్ కెమెరాలు, డిజిటల్ ఎస్ఎల్ఆర్లు ఉపయోగించే స్థాయి నుండి మిర్రర్ లెస్ కెమెరాలను ఉపయోగించే స్థాయికి సాంకేతికత విస్తరించింది. వన్య్రపాణి ఫొటోగ్రఫీపై ఎక్కుమంది ఆసక్తి చూపుతున్నారు. నేను ఫొటోగ్రఫీ మొదలుపెట్టిన తొలిరోజులకు ఇప్పటికీ తేడా ఏమిటంటే జీవజాతుల సంఖ్య తగ్గడం మొదలైంది. వన్య్రపాణులకు ముప్పు పెరిగింది. అందమైన ఫొటోలను తీస్తేనే సరి΄ోదు. ప్రకృతిని, వన్య్రపాణులను రక్షించడానికి కెమెరాను గొప్ప సాధనంగా ఉపయోగించుకోవచ్చు’ అంటున్నారు రాధిక రామస్వామి.


