భారత అసిస్టెంట్ కోచ్ రాధిక
న్యూఢిల్లీ: వాలీబాల్లో యువ ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపడాలంటే ఫ్రాంచైజీ లీగ్ల అవసరం చాలా ఉందని భారత మహిళల జట్టు అసిస్టెంట్ కోచ్ రాధిక పరుచూరి అభిప్రాయపడ్డారు. తమ ప్రతిభను నిరూపించుకునేందుకు లీగ్కు అవకాశం కల్పిస్తాయని ఆమె వ్యాఖ్యానించారు. అగ్రశ్రేణి ఆటగాళ్లతో కలిసి ఆడితే యువ ప్లేయర్లు ఎంతో నేర్చుకుంటారని రాధిక పేర్కొంది. వాలీబాల్ చాంపియన్స్ లీగ్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ... ‘వాలీబాల్లో భవిష్యత్ తరాలకు ఫ్రాంచైజీ లీగ్లు ఎంతో ఉపయోగపడతాయి. సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం అక్కడ లభిస్తుంది. వారి ప్రతిభ ఇలాంటి చోట బయటపడుతుంది.
ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడినప్పుడు తమ స్థాయి ఎలాంటిదో తెలుస్తుంది. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు కూడా. ఇలాంటి లీగ్ల ద్వారానే వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. లీగ్ల నిర్వహణ వల్ల అంతర్జాతీయంగా భారత వాలీబాల్ స్థాయి కూడా పెరుగుతుంది’ అని రాధిక వివరించారు. ఎఫ్ఐవీబీ లెవల్–3 కోచ్ అయిన రాధిక... ఇటీవల జరిగిన ఆసియా అండర్–18 వాలీబాల్ చాంపియన్షిప్లో భారత జట్టుకు హెడ్ కోచ్గా కూడా వ్యవహరించారు.
‘నేను భారత జట్టుకు ఆడిన సమయంలో ఆసియాలో మన జట్టు ఎప్పుడైనా టాప్–10 ర్యాంకుల్లో ఉండేది. ఆ తర్వాత ఒక్కసారిగా జట్టు ప్రదర్శన పడిపోయింది. ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడకపోవడంతో పాటు దేశవాళీ స్థాయిలో కూడా సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల అమ్మాయిలకు తగినన్ని అవకాశాలు రాకపోవడం అందుకు కారణం. గత పదేళ్లుగా మన వద్ద ఎన్నో సమస్యలు నడుస్తున్నాయి. సరైన టోర్నీలో జరగలేదు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఈ లీగ్లు ఎంతో మేలు చేస్తాయి’ అని రాధిక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అక్టోబర్లో 10 నగరాల ఫ్రాంచైజీలతో వాలీబాల్ చాంపియన్స్ లీగ్ జరగనుంది.


