బ్రిస్టల్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత్పై ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 159 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి ఇంకా 37 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టంతో 158 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బ్యాటర్లు ఫిలిప్ సాల్ట్ 59, హ్యారీ బ్రూక్ 79 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అజేయ ఇన్నింగ్స్తో తమ జట్టుకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ ఒక వికెట్ పడగొట్టాడు. 3.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్షదీప్ సింగ్ 41 పరుగులు ఇచ్చాడు.
భారత జట్టు బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వైభవ్ సూర్యవంశీ(15), అభిషేక్ శర్మ(16), ఇషాన్ కిషన్(4) వంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన చోట.. ఇంగ్లండ్ బౌలర్లకు శ్రేయస్ చుక్కలు చూపించాడు. తన ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన శ్రేయస్, క్రీజులో సెటిల్ అయ్యాక బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(22) పర్వాలేదన్పించాడు.
సిరీస్ ఇంగ్లండ్ కైవసం
5 మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇంగ్లండ్ ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచుల్లో మూడు మ్యాచ్లను ఇంగ్లండ్ గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారత్ ఒక్క మ్యాచ్నూ గెలవలేదు. ఇక ఆఖరి మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా జూలై 11న జరగనుంది.


