టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. ఇంగ్లండ్కు చెందిన ఒక క్లబ్ క్రికెట్ జట్టు టీ20 మ్యాచ్లో ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 417 పరుగుల భారీ స్కోరు సాధించింది. వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ లీగ్లో భాగంగా బుధవారం డంబుల్టన్ క్రికెట్ క్లబ్, హేథర్లీ అండ్ రెడ్డింగ్స్ క్రికెట్ క్లబ్ జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్లో డంబుల్టన్ క్రికెట్ క్లబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా డంబుల్టన్ బ్యాటర్ ఇవాన్ గెగ్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. ఇవాన్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో గెగ్ కేవలం 55 బంతుల్లోనే అజేయ డబుల్ సెంచరీ(205)తో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, 23 భారీ సిక్సర్లు ఉన్నాయి.
అతడి స్ట్రైక్ రేట్ 374.55 కావడం గమనార్హం. అతడితో పాటు ఓపెనర్ ఓపెనర్ థామస్ కెల్లీ (కేవలం 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 64 పరుగులు), డాన్ హాలండ్ (37 బంతుల్లో 4 ఫోర్లు, 16 సిక్సర్లతో 122 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన డంబుల్టన్ క్రికెట్ క్లబ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 417 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది.
తద్వారా ఓవరాల్ టీ20 క్రికెట్లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా డంబుల్టన్ క్రికెట్ క్లబ్ నిలిచింది. ఇంతకుముందు 2017లో ఢిల్లీ వేదికగా జరిగిన స్ధానిక టోర్నమెంట్లో మావి XI జట్టు.. ఫ్రెండ్స్ XIపై 416 పరుగులు నమోదు చేసింది. తాజా మ్యాచ్తో ఈ ఆల్టైమ్ రికార్డును డంబుల్టన్ బ్రేక్ చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్కోర్ సాధించిన రికార్డు జింబాబ్వే పేరిట ఉంది. 2024లో గాంబియాతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల నష్టానికి 344 పరుగులు సాధించింది.
పోరాడిన హేథర్లీ
కాగా 418 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హేథర్లీ అండ్ రెడ్డింగ్స్ క్రికెట్ క్లబ్ కూడా కాస్త ధీటుగానే ఆడింది. 19.1 ఓవర్లలో ఆ జట్టు 229 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ హ్యారీ బ్లూమ్ఫీల్డ్ కేవలం 48 బంతుల్లోనే (109) సెంచరీ సాధించాడు.


