బీసీసీఐ తన పంథా మార్చేసిందా? ఒకప్పుడు స్టార్ క్రికెటర్లు రిటైర్ అవుతున్నారంటే వీడ్కోలు మ్యాచ్తో పాటు ఘనంగా సత్కారాలు, సన్మానాలు జరిగేవి. ఆటగాడు కోరుకున్న చోటే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేలా సన్నాహకాలు చేసే వారు. కానీ ఇప్పుడు అదంతా గతం గతః అన్నట్లుగా తయారైంది. సరైన ప్రదర్శన చేయకుండా జట్టుకు భారంగా మారిన సదరు ఆటగాడికి వీడ్కోలు మ్యాచ్ లేకపోగా బలవంతంగా జట్టు నుంచి పంపించే మహత్తర కార్యక్రమానికి తెర లేచింది. తాజాగా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో బీసీసీఐ అవలంబిస్తోన్న వైఖరి ఇందుకు ఉదాహరణ.
బీసీసీఐ నుంచి ఘనంగా వీడ్కోలు అందుకన్న క్రికెటర్లలో సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, హర్భజన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే. అయితే ఈ మధ్య కాలంలో ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయకపోతే రిటైర్మెంట్కు సమయం వచ్చేసిందంటూ వార్తలు రావడం, ఆ తర్వాత కనీస వీడ్కోలు మ్యాచ్ కూడా లేకుండానే వాళ్లు రిటైర్ ఇవ్వడం జరిగిపోతున్నాయి.
తాజాగా సూర్యకుమార్ను ముందు టీ20 కెప్టెన్గా తొలగించిన బీసీసీఐ ఇప్పుడు బలవంతంగా జట్టులో నుంచి పంపించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీమిండియాలోకి లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనతికాలంలోనే సూర్యకుమార్ టీ20 క్రికెట్లో స్టార్ హోదా పొందాడు.
2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పడంతో అతడి స్థానంలో సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్తో పాటు 2026 టీ20 ప్రపంచకప్ను నిలుపుకోవడం విశేషం. ధోని, రోహిత్ తర్వాత భారత్కు టీ20 ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్గా సూర్యకుమార్ నిలిచాడు.
గంగూలీ, ద్రవిడ్, కోహ్లీలకు సాధ్యం కాని ఐసీసీ మేజర్ టైటిల్ సూర్య ఖాతాలో ఉండడం గమనార్హం. మరి ఇలాంటి హోదా పొందిన సూర్యకుమార్కు, కేవలం టీ20 స్పెషలిస్ట్గా ముద్రపడిన వ్యక్తికి గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరముంది. అంతేకాని పొమ్మనలేక పొగబెట్టడం అన్న తరహాలో బీసీసీఐ ప్రవర్తించడంపై టీమిండియా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎలాగూ కెప్టెన్సీ పదవి నుంచి తొలగ2ఇంచారు కాబట్టి కనీసం ఆఫ్గన్తో టీ20 సిరీస్కు అతడిని పరిగణలోకి తీసుకొని సెండాఫ్ మ్యాచ్ ఆడేలా అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
గతంలో అలా..

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ 1986లో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. కానీ అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ఖాన్.. తమతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాలని గావస్కర్ను కోరాడు. దీనికి గావాస్కర్ ఒప్పుకోవడం, బీసీసీఐ కూడా ఓకే అనడంతో 1987లో పాక్తో టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత ఘనంగా వీడ్కోలు పలికాడు. పనిలో పనిగా గావస్కర్ 10వేల పరుగులు కూడా పూర్తయ్యాయి. అలా గావస్కర్ తన వీడ్కోలు మ్యాచ్ను ఎన్నటికీ మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోయింది.
టెండూల్కర్ 200వ టెస్టు మ్యాచ్

భారత క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ ఎలాంటి వీడ్కోలు ఇచ్చిందో అందరికీ తెలిసిందే. అతడి వందో సెంచరీ కోసం కొన్నేళ్లు వేచి చూడాల్సి వచ్చినా బీసీసీఐ అతడిని పక్కకు పెట్టలేదు. 2014లో ముంబైలోని తన హొంగ్రౌండ్లో 200వ టెస్టు మ్యాచ్ ఆడిన సచిన్కు స్టేడియం మొత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. ఆ మధురానుభూతులు ఇప్పటికీ తన కళ్ల ముందు ఉన్నాయని సచిన్ చాలాసార్లు పేర్కొన్నాడు.
షాక్ ఇచ్చిన ధోని..

భారత క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్గా ఎంఎస్ ధోనికి పేరుంది. రెండు ప్రపంచకప్లతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని సాధించిన ధోనికి 2019 వరల్డ్కప్లో సెమీస్ మ్యాచ్ చివరిది అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. 2019లో ఆటకు దూరమైన ధోని.. తాను తలచుకుంటే బీసీసీఐకి చెప్పి ఒక వీడ్కోలు మ్యాచ్ ఆడడం పెద్ద విషయం కాదు. కానీ ధోని అలా చేయలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం రావాలనే ఉద్దేశంతో 2020 ఆగస్టు 15 సాయంత్రం ఏడు గంటలకు తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్లో కేవలం ఒక పోస్టు పెట్టి ప్రకటించాడు.
గంభీర్ రాక.. మారిన పరిస్థితులు

టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ భారత హెడ్కోచ్గా వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అనుభవానికి ప్రాధాన్యమివ్వకుండా ఫామ్లో ఉన్న ఆటగాడికే తన మద్దతు ఉంటుందని గంభీర్ వచ్చిన కొత్తలోనే కుండబద్దలు కొట్టాడు. తన సమకాలీన క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలోనూ ఇలాంటి వైఖరినే వ్యవహరించాడు.
2024లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్లో ఈ ఇద్దరు విఫలమయ్యారు. దీంతో తాము టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందని భావించిన రోహిత్, కోహ్లీలు స్వల్ప వ్యవధిలో గుడ్బై చెప్పేశారు. అలా కాదని వీళ్లిద్దరు బీసీసీఐకి తమకు ఒక చివరి టెస్టు మ్యాచ్ ఏర్పాటు చేయాలని అడిగి ఉంటే సమాధానం ఎలా వచ్చి ఉండేదో.

ఇప్పుడు సూర్యకుమార్ వంతు వచ్చింది. ఒకప్పుడు మిస్టర్ 360 డిగ్రీస్ క్రికెటర్గా పేరు పొందిన సూర్యకుమార్ ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా మిగిలిపోయాడు. టీమిండియా క్రికెట్కు అతడు అందించిన రెండు కప్పులను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ అతడికి ఆఖరి టీ20 మ్యాచ్ ఆడే అవకాశం కల్పించాలని కోరుకుందాం.
చదవండి: గెంటేస్తారన్న భయం.. కట్చేస్తే చరిత్రకు అడుగు దూరంలో!


