PC: BCCI/IPL
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ను వీడటం అతి పెద్ద రిస్క్ అని తెలిసినప్పటికీ.. తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నానన్నాడు. తన భార్య, కుటుంబంతో ఈ విషయం గురించి సుదీర్ఘంగా చర్చించానని.. అయితే, జట్టును వీడటమే సరైందని అనిపించిందన్నాడు.
ట్రేడింగ్ ద్వారా
కాగా ఐపీఎల్-2026 ఆరంభానికి ముందు సంజూ రాజస్తాన్ను వీడిన సంగతి తెలిసిందే. కెప్టెన్గా రాయల్స్ను 2022లో ఫైనల్కు చేర్చిన సంజూ.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ సంజూను పొందేందుకు రాజస్తాన్కు రవీంద్ర జడేజా, సామ్ కరన్ను రాజస్తాన్కు ట్రేడ్ చేసింది.
సంజూ ధర రూ. 18 కోట్లకు సమానంగా చెల్లించి అతడిని సీఎస్కే ట్రేడ్ చేసుకుంది. అయితే, టీ20 ప్రపంచకప్-2026 హీరోగా నిలిచిన సంజూ.. చెన్నై జట్టు తరఫున ఐపీఎల్-2026 ఆరంభంలో మాత్రం తేలిపోయాడు. ఆ తర్వాత సెంచరీలతో సత్తా చాటి ఫామ్లోకి వచ్చాడు.
అతి పెద్ద రిస్క్ అని తెలుసు
తాజాగా ఈ విషయాల గురించి సంజూ శాంసన్ జియోస్టార్తో మాట్లాడాడు. ‘‘రాజస్తాన్ రాయల్స్ను వీడటం అతి పెద్ద రిస్క్ అని తెలుసు. అయితే, ఒక్కసారి మన మనసులోని మాటను ఫ్రాంఛైజీకి చెప్పిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదరదు. నేను ఆ జట్టును వీడటానికి రెండు కారణాలు ఉన్నాయి.
ముందుగా.. అంటే 2025లోనే నేను రాజస్తాన్ను వీడాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం గురించి నా భార్య, కుటుంబంతో దాదాపు మూడు వారాల పాటు చర్చించాను. వాళ్లు కూడా రిస్క్ ఎందుకు అన్నారు.
నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ
అయితే, నేను మాత్రం ఆఖరికి ఇదే సరైన నిర్ణయం అని భావించాను. ఇక రెండో కారణం.. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టడానికి కూడా నేను సిద్ధంగానే ఉంటాను. చాలా మంది నా బ్యాటింగ్ స్టైల్.. చెన్నైలోని స్లో చెపాక్ వికెట్కు సరిపోదని చెప్పారు. అయినా సరే నేను ఆ జట్టులో చేరేందుకు మొగ్గుచూపాను.
‘ఇప్పుడు నీకు 30 ఏళ్లు.. ఏదైతే అది అయింది’ అని నా మనసుకు సర్దిచెప్పుకొన్నాను. నాకు అక్కడ కొత్త శక్తి లభించినట్లయింది. అయితే, ఆరంభంలో నేను తడబడ్డా. మూడు మ్యాచ్లలో విఫలమయ్యాను. జట్టు కూడా ఓడిపోయింది. వరల్డ్కప్లో సత్తా చాటిన తర్వాత ఇలా జరగడం పూర్తిగా నిరాశపరిచింది.
మేనేజ్మెంట్తో పాటు మహీ భాయ్ కూడా!
అయితే, ఆ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ నాకు మద్దతుగా నిలిచింది. సహచర ఆటగాళ్లు కూడా ముందులానే నన్ను గౌరవించారు. నాపై నమ్మకం ఉంచారు. మహి భాయ్ (మహేంద్ర సింగ్ ధోని) కూడా నాకు అండగా నిలిచాడు. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు’’ అని సంజూ శాంసన్ భావోద్వేగానికి లోనయ్యాడు.


