వైభవ్- అభిషేక్ (PC: BCCI X)
టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లలో క్లీన్స్వీప్ కావడమే ఇందుకు కారణం. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ గురైన శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్నూ విజయమన్నదే లేకుండా ముగించింది. ఇంగ్లిష్ జట్టు చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది.
ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కోసం వరల్డ్కప్ హీరో సంజూ శాంసన్ను పక్కనపెట్టడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా సంజూ ఐర్లాండ్తో రెండు టీ20లు (5, 0).. అదే విధంగా ఇంగ్లండ్తో తొలి టీ20 (1)లో విఫలమయ్యాడు.
ఈ క్రమంలోనే సంజూను తప్పించి.. అతడి స్థానంలో ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ రెండో టీ20తో అరంగేట్రం చేశాడు. అయితే, వరుసగా మూడు మ్యాచ్లు ఆడిన వైభవ్.. 13, 14, 15 పరుగులు చేశాడు. అంతేగాక వైభవ్ రాకతో టాపార్డర్లో ముగ్గురూ (ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్) లెఫ్టాండర్లే అయ్యారు.
ఈ నేపథ్యంలో నామమాత్రపు ఐదో టీ20లో మాత్రం వైభవ్ సూర్యవంశీని తప్పించి.. సంజూ శాంసన్ను తిరిగి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వివరణ ఇచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ..
‘‘సౌతాంప్టన్ పిచ్ పరిస్థితికి తగ్గట్లు మేము అత్యుత్తమ ఓపెనింగ్ కాంబినేషన్తో ముందుకు వెళ్లాలని అనుకున్నాము. అభిషేక్ శర్మతో కలిసి కుడిచేతి వాటం బ్యాటర్తో ఓపెనింగ్ చేయించాలని ఫిక్స్ అయ్యాము. అందుకే వైభవ్ను తప్పించాము.
ఈ మ్యాచ్కు ఇలా చేయడమే సరైన నిర్ణయం. సంజూ గన్ బ్యాటర్. గతంలో ఒంటిచేత్తో ఎన్నో సిరీస్లు గెలిపించాడు’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఐదో టీ20లో సంజూ 27 పరుగులు చేయగా.. అభిషేక్ 3 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. టీమిండియా 201 పరుగులకే కుప్పకూలింది.


