భారీ మార్పునకు ఫిఫా ప్లాన్‌.. భారత్‌కు బిగ్‌ చాన్స్‌! | FIFA Plans Major Changes Next World Cup Will Boost India Qualify Hopes | Sakshi
Sakshi News home page

భారీ మార్పునకు ఫిఫా ప్లాన్‌.. భారత్‌కు బిగ్‌ చాన్స్‌!

Jul 13 2026 11:41 AM | Updated on Jul 13 2026 1:00 PM

FIFA Plans Major Changes Next World Cup Will Boost India Qualify Hopes

ఫిఫా అధ్యక్షుడు గియానితో భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు కళ్యాణ్‌ చౌబే

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 ఎడిష‌న్ చివ‌రి అంకానికి చేరుకుంది. 48 జట్లు బరిలోకి దిగితే అందులో నుంచి నాలుగు జట్లు సెమీస్‌లో ప్రవేశించాయి. తొలి సెమీస్‌లో ఫ్రాన్స్‌తో స్పెయిన్‌, రెండో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇక అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఫిఫా ప్రపంచకప్ సూపర్ సక్సెస్ అయింది. 

2022తో పోలిస్తే ఈసారి ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ పెరిగింది. ముఖ్యంగా క్రికెట్‌ను ఎక్కువగా అభిమానించే భారత్ లాంటి దేశాల్లోనూ ఈసారి ఫిఫా క్రేజ్ మాములుగా లేదు. కేరళ, బెంగాల్‌కు తోడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఫిఫాకు సంబంధించి ప్రత్యేక హోర్డింగ్‌లు, స్టార్ ఆటగాళ్ల కటౌట్‌లు దర్శనమిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీల్లో ఒకటిగా నిలిచిన ఫిఫాను మరింత విస్తరించే యోచనలో ఫిఫా సమాఖ్య అడుగులు వేస్తోంది.  2030 ఫిఫా ప్రపంచకప్ నాటికి టోర్నీలో పాల్గొనే జట్ల సంఖ్య 48 నుంచి 64కు పెంచాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినోతో ఫిఫా సమాఖ్య బృందం సమావేశమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన చేయనున్నారు. 

ఇలా చేయడం వల్ల ఫుట్‌బాల్‌లో అతిపెద్ద వేదిక అయిన ఫిఫాలో పోటీపడాలనే కల ప్రతీ దేశానికి కలుగుతుందని గియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. ఒకవేళ వచ్చే ప్రపంచకప్ లేదా ఆ తర్వాత జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇది జరిగితే భారత్‌కు అవకాశమెంత ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నో ఏళ్ల నుంచి ఫిఫాలో ఆడాలన్న భారత్‌ కల నెరవేరుతుందా? దీనికి సంబంధించిన అవకాశాలెంత అనేది ఒకసారి పరిశీలిద్దాం.

అలా అయితేనే భారత్‌కు చాన్స్‌!
వచ్చే ఫిఫా ప్రపంచకప్ (2030) నాటికి 64 జట్లు పాల్గొంటే ఆసియా ఖండం నుంచి భారత ఫుట్‌బాల్ జట్టుకు అవకాశం ఉంటుందా అంటే చెప్పలేం. అది రాబోయే నాలుగేళ్లలో మన జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడ‌రేష‌న్ (ఏఎఫ్‌సీ) ర్యాంకింగ్స్‌లో భార‌త్ 24వ స్థానంలో కొన‌సాగుతుంది. 

ఒకవేళ 2030 ఫిఫా నాటికి 64 జ‌ట్ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తే ఆసియా ఖండం నుంచి క్వాలిఫై అయ్యే జ‌ట్ల సంఖ్య 11 లేదా 12కు పెర‌గనుంది. ఫిఫా ర్యాంకింగ్స్ ఆధారంగా జ‌పాన్‌, సౌత్ కొరియా, ఇరాన్, ఆస్ట్రియా, సౌదీ అరేబియాలు నేరుగా టాప్ ఐదు స్థానాలకు అర్హ‌త సాధిస్తాయి. ఖ‌తార్‌, ఇరాక్‌, ఉజ్బెకిస్తాన్‌, యూఏఈ, జోర్డాన్ జ‌ట్లు మిగ‌తా నాలుగు స్థానాల‌కు పోటీ ప‌డ‌నున్నాయి. 

ఒక‌వేళ 11 లేదా 12 జ‌ట్ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తే భార‌త్ ఈ స్థానాల‌కు పోటీ ప‌డే అవ‌కాశం ఉంటుంది. అయితే ఈ రెండు స్థానాల‌కు కూడా ఒమ‌న్‌, బ‌హ్రెయిన్‌, సిరియా, చైనా, వియ‌త్నాం, థాయ్‌లాండ్‌ల నుంచి భార‌త్‌కు గ‌ట్టి పోటీ ఉండ‌నుంది. అది కూడా భార‌త్ ప్ర‌స్తుత‌మున్న 24వ ర్యాంక్ నుంచి 15వ ర్యాంకుకు చేరుకుంటేనే ఫిఫాకు అర్హ‌త సాధించే అవ‌కాశ‌ముంటుంది. 

ఎందుకంటే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ అర్హ‌త‌కు ఆసియా ఖండం నుంచి 15 అత్యుత్త‌మ జ‌ట్ల‌కు మాత్ర‌మే క్వాలిఫ‌యింగ్ పోటీల‌కు అర్హ‌త క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. ఈ లెక్క‌న 2030లో భార‌త్ ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించాలంటే వ‌చ్చే నాలుగేళ్ల‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌నతో టాప్‌-15లో చోటు ద‌క్కించుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది.

2022లో ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో 32 దేశాలు పాల్గొన్నాయి. తాజా ప్రపంచకప్‌లో ఆ సంఖ్యను 48కి పెంచారు. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే ఫిఫా ప్రపంచకప్‌ ఖండాంతరాలను దాటి విశ్వవ్యాప్త క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్న తరుణంలో ఫిఫా జట్ల సంఖ్యను మరింత పెంచాలనే నిర్ణయానికి రావడం అభినందించాల్సిన అంశం.

Read: సీఎస్‌కే కోచ్‌ పదవికి స్టీఫెన్‌ ప్లెమింగ్‌ గుడ్‌ బై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement