సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 విజేతగా నిలిచిన టీమిండియాకు.. విదేశీ గడ్డ మీద ఘోర పరాభవం ఎదురైంది. మెగా టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత తొలి ప్రయత్నంగా ఐర్లాండ్తో తలపడ్డ భారత్ ఊహించని రీతిలో.. ఆతిథ్య జట్టు చేతిలో 2-0తో క్లీన్స్వీప్నకు గురైంది.
శ్రేయస్ అయ్యర్కు చేదు అనుభవం
ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్వాష్ అయింది. దీంతో టీమిండియా టీ20 కెప్టెన్గా ప్రయాణం మొదలుపెట్టిన శ్రేయస్ అయ్యర్కు తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం మిగిలింది. ఈ రెండు టీ20 సిరీస్లలో భారత్ క్లీన్స్వీప్ కావడంతో అతడి కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈజీ ఆప్షన్ అదే!
అదే సమయంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పైనా మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ రెండు సిరీస్లలో టీమిండియా ఘోర ఓటమి నేపథ్యంలో గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను తొలగించడమనేది అత్యంత సులువైన ఆప్షన్.
అయితే, ఆ విషయం పక్కనపెట్టి భారత జట్టు ఓటమికి అసలు కారణాలు ఏమిటో ముందు విశ్లేషించండి. నిజానికి ఐర్లాండ్, ఇంగ్లండ్.. అంటే విదేశీ గడ్డ మీద ఈ మ్యాచ్లు జరగడమే భారత్ ఓటమికి ప్రధాన కారణం.
వికెట్ ఇలా ఉంది కాబట్టే
మన బ్యాటర్లు విదేశీ పిచ్ల మీద ఆడేందుకు ఏమాత్రం సన్నద్ధం కాలేదు. ఎందుకంటే.. మన సెలక్టర్లు కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వీరిని విదేశీ టూర్కు ఎంపిక చేశారు. ఐపీఎల్ మన బ్యాటర్లకు ఓ కవచం వంటిది. ఇక్కడ రాణిస్తే చాలు జాతీయ జట్టులోకి వచ్చేస్తామనే నమ్మకం కుదిరింది.
అయితే, ఐపీఎల్ రూపొందించినటువంటి ఫ్లాట్ పిచ్లను నేను జీవితంలో ఇంత వరకు చూడనేలేదు. వికెట్ ఇలా ఉంది కాబట్టే మన బ్యాటర్లు.. ముఖ్యంగా టాపార్డర్లో వచ్చిన వాళ్లు మంచినీళ్ల ప్రాయంగా పరుగులు రాబడుతున్నారు.
మరి విదేశాల్లో వికెట్లు ఇలా ఉండవు కదా. అక్కడ మార్బుల్ షీట్పై బ్యాటింగ్ చేయడం కుదరదు. ఇలాంటపుడే సెలక్టర్లు మరింత తెలివిగా ఆలోచించాల్సింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ గడ్డ మీద రాణించిన శుబ్మన్ గిల్ వంటి ఆటగాళ్లను సెలక్ట్ చేయాల్సింది.
దిక్కుమాలిన ఐడియా ఇచ్చిన వారిపైనే వేటు
ఈ పరాజయాల నేపథ్యంలో లోతుగా విచారణ, విశ్లేషణ జరపాలి. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్లు రూపొందించమని బీసీసీఐకి సలహా ఇచ్చిన వారిని ముందుగా తొలగించాలి.
ఐపీఎల్ను మరింత పాపులర్ చేయాలని.. వాణిజ్యపరంగా లాభాలు పొందాలని చూస్తే పరిస్థితులు ఇలాగే దిగజారిపోతాయి’’ అని సంజయ్ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా వరుస సిరీస్లలో వైట్వాష్ నేపథ్యంలో టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని ఇంగ్లండ్కు కోల్పోయింది.


