ఇంగ్లండ్ టెస్టు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌! | Rahul Dravid Contender For England Cricket Head Coach Role | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ టెస్టు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌!

Jul 13 2026 7:38 AM | Updated on Jul 13 2026 8:22 AM

Rahul Dravid Contender For England Cricket Head Coach Role

ఇంగ్లండ్‌  టెస్టు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా విధులు నిర్వర్తిస్తోన్న బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఓటమి తర్వాత ఆ ఫార్మాట్‌ నుంచి కోచ్‌గా తప్పుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో టెస్టు జట్టుకు కొత్త కోచ్ ఎవరన్న దానిపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్ పేరు తెరమీదకు రావడం ఆసక్తి కలిగిస్తోంది. 

డైలీ మెయిల్ నివేదిక ప్రకారం ఇంగ్లండ్‌ టెస్టు కోచ్‌ పదవికి దరఖాస్తు పంపిన వారి జాబితాలో జింబాబ్వే దిగ్గజం ఆండీ ప్లవర్‌, మాజీ ఇంగ్లండ్ స్పిన్నర్ రిచర్డ్ డాసన్‌లతో పాటు ద్రవిడ్ పేరు ఉన్నట్లు సమాచారం. ఇక వైట్‌బాల్‌ క్రికెట్‌లో మాత్రం మెక్‌కల్లమ్‌ యధావిథిగా కోచ్‌ పాత్రను పోషించనున్నాడు. 

ఇక రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో హెడ్‌కోచ్‌గా పనిచేసిన అనుభవముంది. అతడి కోచింగ్ హయాంలోనే టీమిండియా 2024 టీ20 ప్రపంచకప్ గెలవడంతో పాటు 2023 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ రన్నరప్‌గా నిలిచింది. అయితే ద్రవిడ్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ అతడు ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా పనిచేయడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి. 

ఇక టెస్టు కోచ్‌ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు ఆండీ ప్లవర్‌. గతంలో ఇంగ్లండ్ కోచ్‌గా పనిచేసిన ఆండీ ప్లవర్ విజయవంతమైన కోచ్‌గా పేరు సాధించాడు. అతడి హయాంలో ఇంగ్లండ్ మూడు యాషెస్ సిరీస్ విజయాలతో పాటు టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంకును అందుకుంది. ఐపీఎల్‌లో ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ సాధించడంలోనూ ఆండీ ప్లవర్ పాత్ర కీలకం. 

ప్రస్తుతం గ్లామోర్గాన్ కోచ్‌గా ఉన్న డాసన్ కౌంటీ, అంతర్జాతీయ క్రికెట్‌లో తన వ్యూహాలతో జట్టును నడిపించడంలో సిద్ధహస్తుడు. వీరితో పాటు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర, మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌, పాక్ హెడ్‌కోచ్ మైక్ హసన్‌, ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.

2022లో టెస్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మెకల్లమ్, అప్పటి కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో కలిసి దూకుడైన ఆటతీరుకు శ్రీకారం చుట్టాడు. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 1-4 తేడాతో ఓటమి పాలవడం, ఆ తర్వాత బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈసీబీ ఒత్తిడి మేరకు మెక్‌కల్లమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

వచ్చే ఏడాది యాషెస్‌ను దృష్టిలో పెట్టుకుని టెస్టు జట్టుకు కొత్త కోచ్‌ను నియమించాలని ఈసీబీ భావిస్తోంది. మెకల్లమ్ మార్గద ర్శకత్వంలో, హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని ఇంగ్లండ్ ఇటీవల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరడమే కాకుండా, తాజాగా భారత్‌పై 4-0తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుని ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.

చదవండి: ‘అంతా ఫిక్సింగ్‌.. వాళ్లను గెలిపించడం కోసమే ఇదంతా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement