సాక్షి, తెలంగాణభవన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట బూతులు, అబద్ధాల ప్రవాహం పారుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలు సైకోలా ఉన్నాయి ముఖ్యమంత్రి లా లేవు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పంట పొలాల్లో మా రక్తం పారిస్తా అని రేవంత్ మాట్లాడుతున్నాడు. హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందని మండిపడ్డారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శాపనార్థాలు రైతులకు అవసరం లేదు. ముఖ్యమంత్రి భాష చూస్తే అబద్ధాలు, శాడిజం, బూతులు కనిపిస్తున్నాయి. కన్నెపల్లి పంపులను ఆన్ చేయమంటే మా రక్తం కావాలనుంటున్నాడు. మా గొంతు నొక్కుతున్నాడు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి రక్తం కావాలంటే ఇస్తాం. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. జైలు పంపుతామంటే ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త భయపడడు. మాకు కేసులు, అరెస్ట్లు కొత్త కాదు. రైతుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. ప్రతి పక్షాలపై ఉన్న దృష్టి పంట పొలాలకి నీళ్లు ఇవ్వడంపై లేదు.
కన్నెపల్లిపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రిని చూస్తే జాలేస్తుంది. విషయం లేకపోవడం వల్లే ఇలా బూతులు మాట్లాడుతున్నారు. అబద్దాలు, బూతుల విషయంలో మేము రేవంత్లో పోటీ పడలేం. ముఖ్యమంత్రికి ప్రాజెక్ట్లపై కనీస విషయ పరిజ్ఞానం లేదు. సీఎం రేవంత్ మాటలు చూస్తే ఓ శాడిస్ట్ మాట్లాడుతున్నాడా? అనిపిస్తోంది. మాట్లాడితే రిటైర్డ్ ఇంజనీర్లను జైలులో పెడతా అని బెదిరిస్తావ్. రిటైర్లు ఇంజనీర్లు కూడా నీళ్లు ఎత్తిపోయవచ్చనే చెబుతున్నారు. రైతులను, ప్రజలను కాపాడాలన్న తపన ముఖ్యమంత్రికి ఉండాలి. సీఎం రేవంత్ ఒక్కటైనా నిజం మాట్లాడుతున్నాడా?.
రేవంత్ రెడ్డిలో సైకో కనిపిస్తున్నాడు. నిన్న ముఖ్యమంత్రిలా ఆయన మాట్లాడలేదు. రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడతున్నారు. ఆయనలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా ఏది మాట్లాడితే అది చెల్లుతుందా?. ఓటమి తప్పదు అనే భయంతో ఇలా బూతు భాష మాట్లాడుతున్నావ్. షాబాద్ ఘటనపై ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు. షాబాద్లో ఘటన జరిగితే రాష్ట్ర పోలీస్ బాస్ గోల్ఫ్ ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి అలానే ఉన్నాడు.. ఆయన నియమించుకున్న పోలీస్ అధికారులు అలానే ఉన్నారు. షాబాద్ ఘటన నిందితులకు, సీఎం రేవంత్కు మధ్య తేడాఈ లేదు. హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.


