తండ్రి అంటే ఓ నీడలా కాపాడే వ్యక్తి.. కానీ అదే నీడ భయంగా మారితే? నమ్మకానికి ప్రతిరూపమైన బంధమే అనుమానంగా మారితే? ఒడిశాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. రక్షణ ఇవ్వాల్సిన తండ్రే తన జీవితంలో భయంకరమైన అధ్యాయంగా మారాడని ఆమె చేసిన ఫిర్యాదుతో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏళ్ల తరబడి సొంత కుమార్తెను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో 57 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడి వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక 22 ఏళ్ల వివాహిత కుమార్తె తీవ్ర నిర్ణయం తీసుకుంది. అత్తింట్లోనే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆమెకు 75 శాతం కాలిన గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న సమయంలో బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో స్టేట్మెంట్ రికార్డు చేసే సమయంలో తన తండ్రితో పాటు మరో ఇద్దరి పేర్లను ఆమె వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలి ఆరోపణల ప్రకారం.. పెళ్లికి ముందే తండ్రి తనను లైంగికంగా వేధించాడని, పెళ్లి తర్వాత కూడా ఈ వేధింపులు కొనసాగాయని తెలిపింది. అంతేకాకుండా, కుటుంబ సమస్యలను అడ్డుపెట్టుకుని తనను మానసికంగా వేధించాడని ఆరోపించింది. మరోవైపు.. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నిందితుడు బాధితురాలి మామ వద్ద రూ.10 లక్షల అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అత్తింటివారు ఒత్తిడి చేయడంతో, డబ్బులు చెల్లించకుండా కుమార్తెను బెదిరింపులకు గురిచేశాడని పోలీసులు తెలిపారు.
A 57-year-old school teacher was arrested in Ganjam, Odisha, for allegedly sexually abusing his daughter for years, even after her marriage. 22-year-old woman, who sustained 75% burn injuries after allegedly setting herself on fire, is undergoing treatment.#Ganjam #Odisha… pic.twitter.com/YeRb36YtDH
— Orissa POST Live (@OrissaPOSTLive) July 11, 2026
తన వ్యక్తిగత ఫొటోలను బయటపెడతానంటూ బెదిరించాడని బాధితురాలు ఆరోపించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మానసిక వేధింపులు, బెదిరింపులు భరించలేకే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం, బెర్హంపూర్ అదనపు ఎస్పీ అలోక్ జెనా మాట్లాడుతూ.. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుడికి చెందిన ఒక మొబైల్ ఫోన్, బాధితురాలి మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిమాఖండి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయుడిపై ఇలాంటి ఆరోపణలు రావడం మరింత కలవరపెడుతోంది.


