అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ మౌనంగా మరో మిషన్ మొదలుపెట్టిందా? అంతర్జాతీయంగా ఈ ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఉపగ్రహ చిత్రాలు ఇరాన్లోని కీలక సైనిక, న్యూక్లియర్ సంబంధిత కేంద్రాల్లో మళ్లీ కదలికలు మొదలైనట్లు సూచిస్తున్నాయి. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనపై అనుమానాలు మరింత పెరిగాయి.
మధ్యప్రాచ్యం ఇప్పటికే ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. అమెరికా ఇరాన్ స్థావరాలపై దాడులు చేయడం, ఆ తర్వాత హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. ఈ సమయంలోనే ఇరాన్ తన దెబ్బతిన్న సదుపాయాలను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయని సమాచారం. కాగా, అత్యంత ఆసక్తిని రేపుతున్న ప్రాంతం ఇరాన్లోని పార్చిన్ మిలిటరీ కాంప్లెక్స్. పశ్చిమ దేశాల నిఘా సంస్థలు ఈ ప్రాంతాన్ని గతంలోనే న్యూక్లియర్ ఆయుధాల అభివృద్ధికి సంబంధించిన పరిశోధనలతో అనుసంధానం చేశాయి. తాజాగా అక్కడ భారీ స్థాయిలో కదలికలు కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు, నేలను సరిచేసే పనులు, నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్నట్లు సమాచారం.
కేవలం పార్చిన్ మాత్రమే కాదు.. తబ్రీజ్, కెర్మాన్షా సమీపంలోని కొన్ని క్షిపణి స్థావరాలు, వైమానిక స్థావరాల్లో కూడా పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భూగర్భ సదుపాయాల వద్ద వాహనాల రాకపోకలు పెరగడం కూడా నిఘా వర్గాల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇరాన్లోని ప్రధాన అణు కేంద్రాలైన నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటివరకు పెద్దఎత్తున పునర్నిర్మాణ కార్యకలాపాలకు స్పష్టమైన ఆధారాలు బయటపడలేదని సమాచారం.
CNN reports that newly released satellite imagery suggests #Iran may be rebuilding suspected #nuclear #facilities following recent U.S. strikes, raising fresh questions about the extent of the damage and Tehran's ongoing nuclear activities. pic.twitter.com/4YvsbIs97X
— The Kabul Tribune (@TheKabultribun) July 11, 2026
ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య గతంలో కుదిరిన అవగాహన ప్రకారం, ఇరాన్ తన పరమాణు కార్యక్రమాన్ని నియంత్రించాలని, ఆయుధాల తయారీ దిశగా వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఇలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే అనుమానాలు ఆ ఒప్పంద భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మరోవైపు అమెరికా, పశ్చిమ దేశాల భద్రతా నిపుణులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ఉపగ్రహ ఆధారాలు మరింత బలపడితే, ఇరాన్పై కొత్త ఆంక్షలు లేదా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు దౌత్య చర్చలు.. మరోవైపు రహస్య కదలికల అనుమానాలు.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.


