రాజస్థాన్లో ప్రభుత్వ రెవెన్యూ శాఖ విడుదల చేసిన పట్వారీల బదిలీ జాబితాలో జరిగిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బదిలీ కావాల్సిన పట్వారీ పేరు స్థానంలో ఏకంగా అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే పేరు అధికారిక ఉత్తర్వులో కనిపించడంతో అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసే ముందు ఎంత జాగ్రత్త అవసరమో మరోసారి స్పష్టమైంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా కావడంతో తీవ్రమైన చర్చ నడుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ సైనికుడు, ప్రస్తుతం పట్వారీగా పనిచేస్తున్న నరేంద్ర సింగ్ను బాలోత్రా జిల్లాలోని నవోడా నుంచి డీగ్ జిల్లాలోని సోన్గావ్కు బదిలీ చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. అయితే బదిలీ ఉత్తర్వులు సిద్ధం చేసే సమయంలో జరిగిన టైపింగ్ లేదా డేటా ఎంట్రీ పొరపాటు కారణంగా నరేంద్ర సింగ్ పేరు స్థానంలో డీగ్–కుమ్హేర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ శైలేశ్ సింగ్ పేరు నమోదైంది. దీంతో అధికారిక ఉత్తర్వు చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఈ తప్పిదం బయటపడిన తర్వాత అసలు బదిలీ కావాల్సిన పట్వారీ నరేంద్ర సింగ్ కొత్త విధుల్లో చేరలేకపోయారు. సవరించిన ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన బదిలీ ప్రక్రియ నిలిచిపోయింది. ఒక చిన్న పరిపాలనా పొరపాటు ఉద్యోగి విధుల్లో చేరడానికే అడ్డంకిగా మారింది. ఈ విషయంపై ఎమ్మెల్యే శైలేశ్ సింగ్ కార్యాలయం స్పందిస్తూ.. ఇది పూర్తిగా సాంకేతిక లేదా టైపింగ్ పొరపాటు మాత్రమేనని, ఎమ్మెల్యేకు ఈ బదిలీలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అధికారులు కూడా తప్పిదాన్ని గుర్తించి సవరించిన ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం.
అయితే ఈ ఘటన ప్రభుత్వ శాఖల పని తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అధికారిక ఉత్తర్వులను విడుదల చేసే ముందు సరైన పరిశీలన జరిగి ఉంటే ఇలాంటి పొరపాటు జరిగేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక పట్వారీ పేరు స్థానంలో ప్రజాప్రతినిధి పేరు అధికారిక పత్రంలో రావడం పరిపాలనా నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


