మరింత ఉన్నత స్థాయికి భారత్–న్యూజిలాండ్ సంబంధాలు
వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రూ. 35,000 కోట్లకు..
ఇరుదేశాల ప్రధానమంత్రులు మోదీ, లక్సన్ భేటీలో నిర్ణయం
కీలక రంగాల్లో పరస్పర సహకారానికి 10 ఒప్పందాలు
క్రీడలపై సంయుక్త కార్యాచరణ ప్రణాళిక ఖరారు
శాంతియుత ఇండో–పసిఫిక్ దిశగా ఉమ్మడిగా కృషి చేయాలని తీర్మానం
అక్లాండ్: భారత్–న్యూజిలాండ్ స్నేహం మరింత బలపడింది. ఇరుదేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రూ.35,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. సముద్ర భద్రత విషయంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించాయి.
న్యూజిలాండ్లోని అక్లాండ్లో శనివారం భారత ప్రధాని మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ సమావేశమయ్యారు. రెండుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. శాంతియుత ఇండో–పసిఫిక్ దిశగా ఉమ్మడిగా కృషి చేయాలని తీర్మానించారు. ఇరువురు నేతల భేటీ సందర్భంగా భారత్, న్యూజిలాండ్ మధ్య 10 కీలక ఒప్పందాలు కుదిరాయి. మొత్తంగా 18 అంశాలపై అంగీకారానికి వచ్చారు.
ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించడానికి నాలుగేళ్ల రోడ్మ్యాప్, హైడ్రోగ్రాఫిక్ డేటా షేరింగ్ను ప్రోత్సహించడం, పరస్పర నావికాదళ లాజిస్టిక్స్ను సులభతరం చేయడం, ఇండో–పసిఫిక్లో మెరుగైన సముద్ర సంబంధాలను రూపొందించడం వంటివి ఇందులో ఉన్నాయి. రాబోయే 15 ఏళ్లలో భారత్లో న్యూజిలాండ్ 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే అంశంపై చర్చ జరిగింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్టీఏ) త్వరగా అమలు చేయడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరింపజేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. చర్చల కోసం గవర్నమెంట్ హౌస్కు చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది.
ఉగ్రవాదాన్ని అరికట్టడానికి సంయుక్త కార్యవర్గం
స్వేచ్ఛాయుత, బహిరంగ, సుసంపన్నమైన ఇండో–పసిఫిక్ పట్ల ఉమ్మడి నిబద్ధతను మోదీ, లక్సన్ పునరుద్ఘాటించారని ఇరుదేశాలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. సార్వ¿ౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను వారు ప్రస్తావించారని తెలిపాయి. ఇండో–పసిఫిక్లో చైనా ప్రాబల్యం పెరుగుతుండడంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
అందుకే శాంతియుత ఇండో–పసిఫిక్ కోసం కలిసి పనిచేయాలని భారత్, న్యూజిలాండ్ సంకల్పించాయి. ఈ ప్రాంతంలో సహకారాన్ని పెంచుకోవడంతోపాటు ఉగ్రవాదాన్ని అరికట్టడానికి సంయుక్త కార్యవర్గం, సముద్ర భద్రత కోసం చర్యలు చేపట్టడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. క్రీడలపై భారత్–న్యూజిలాండ్ సంయుక్త కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు.
హార్మూజ్లో నౌకలపై ఆంక్షలు వద్దు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, పౌరులకు రక్షణ కల్పించాలని సూచించారు. హార్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించకూడదని ఇరు నేతలు కోరారు.
మాతో భాగస్వాములుగా మారండి
న్యూజిలాండ్ పెట్టుబడిదారులకు మోదీ పిలుపు
చరిత్రాత్మక భారత్–న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని మోదీ అన్నారు. ఆయన శనివారం న్యూజిలాండ్ కంపెనీల సీఈఓలు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో ఆయన సమావేశమయ్యారు. రెండు దేశాల ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం, సుస్థిర అభివృద్ధి పట్ల నిబద్ధత అనేవి దూరదృష్టితో కూడిన ఆర్థిక భాగస్వామ్యానికి పటిష్టమైన పునాదిగా నిలుస్తాయని తెలిపారు.
భారత్, న్యూజిలాండ్ల బలమైన ఆర్థిక భాగస్వామ్యం వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని వివరించారు. భారత్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారత్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పౌర విమానయానం, లాజిస్టిక్స్, స్వచ్ఛ ఇంధనం, పట్టణ రవాణా, నీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రంగాల్లో భాగస్వాములుగా చేరాలని న్యూజిలాండ్ పెట్టుబడిదారులను, వ్యాపార సంస్థలను మోదీ ఆహ్వానించారు.
భారత అభివృద్ధి వేగం అపూర్వం: ‘కియా ఓరా మోదీ’లో ప్రధాని
అక్లాండ్: అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశ అభివృద్ధి వేగం అపూర్వమైనదని ప్రధాని మోదీ అన్నారు. మన దేశం ప్రపంచానికి కొత్త అభివృద్ధి నమూనాలను అందిస్తోందని చెప్పారు. ఆయన శనివారం అక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్తో కలిసి ‘కియా ఓరా మోదీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించిన ప్రసంగించారు.
భారత్, న్యూజిలాండ్ సంబంధం మధురమైన జ్ఞాపకాలు, శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, పరస్పర నిబద్ధతపై నిర్మితమైందని వివరించారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ అభివృద్ధి పథంలో భారత్ వేగంగా పరుగులు తీస్తోందని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిందని వెల్లడించారు.
ఉమ్మడి ప్రయాణానికి ‘వాకా’: ‘కియా ఓరా మోదీ’లో ప్రధాని మోదీ ఓ మఫ్లర్ను ప్రజలకు చూపించారు. దాదాపు 30 ఏళ్ల క్రితం న్యూజిలాండ్లో పర్యటించినప్పుడు ఇది తనకు బహుమతిగా లభించిందని తెలిపారు. దీంతోపాటు ఒక టోపీ కూడా గిఫ్ట్గా వచ్చిందని చెప్పారు. అప్పటి తాను ప్రజా జీవితంలోకి ప్రవేశించలేదని వెల్లడించారు. న్యూజిలాండ్ సంస్కృతికి చెందిన ‘వాకా’అనే పదం గురించి మోదీ ప్రస్తావించారు.
ఈ అందమైన పదం భారత్, న్యూజిలాండ్ సంబంధాల సారాంశాన్ని తెలియజేస్తుందని అన్నారు. శతాబ్దాలుగా ఈ పదం ప్రజలను ఏకం చేయడానికి ప్రతీకగా నిలుస్తోందని వివరించారు. వాకా కేవలం ఒక పడవ కాదని, ఉమ్మడి ప్రయాణానికి అదొక చిహ్నమని తెలిపారు. ఈ రోజు భారత్–న్యూజిలాండ్ వాకా కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు.
బైబై న్యూజిలాండ్
ప్రధాని మోదీ న్యూజిలాండ్లో రెండు రోజుల పర్యటన ముగించుకొని శనివారం స్వదేశానికి బయలుదేరారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఎయిర్పోర్టులో మోదీకి వీడ్కోలు పలికారు.


