ఆక్లాండ్: భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్.. అంతర్జాతీయ వృద్ధికి భారత్ ప్రయోగాల వేదిక అంటూ ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్-న్యూజిలాండ్' సరికొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉందన్న మోదీ.. ఇరు దేశాల ముందు ‘అపారమైన అవకాశాల సముద్రం’ ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయాణ విజయానికి అసలైన దిశానిర్దేశకులు ఈ ప్రవాస భారతీయులేనంటూ పేర్కొన్నారు. ఈ దేశం నలుమూలలా భారతీయులు ఉన్నారని.. ఈ ప్రయాణం విజయవంతమవుతుందనే నమ్మకం ఉందన్నారు.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఇరుదేశాల ప్రధానుల చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్ సహా పలు అంశాల్లో మరిన్ని అవకాశాలపై భారత్ ఫోకస్ పెట్టింది. ఇరుదేశాల స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ రోడ్ మ్యాప్-2030 ఆవిష్కరించారు. భారత్, న్యూజిలాండ్ దేశాలు శనివారం (జూలై 11, 2026) తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ల మధ్య జరిగిన చర్చల అనంతరం, 2030 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు, సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి రూ.35,000 కోట్లకు చేర్చాలని ఐదేళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.
ఈ సమావేశం ద్వారా 10 ఒప్పందాలతో కలిపి మొత్తం 18 నిర్దిష్ట ఫలితాలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా రాబోయే నాలుగేళ్లలో సంబంధాలను విస్తరించుకోవడానికి ఒక రోడ్మ్యాప్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర సహకారాన్ని పెంపొందించుకోవడానికి కార్యాచరణ, భారత నౌకాదళం, న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందాలు జరిగాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న దూకుడు నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో సహకారాన్ని విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా సాగిన మోదీ మూడు దేశాల పర్యటనలో ఆక్లాండ్ చివరి విడత. నిన్న రాత్రి ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఇటీవల భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) తర్వాత ఈ పర్యటన జరగడం విశేషం. కాగా, హాకాతో ప్రధాని మోదీకి సంప్రదాయ స్వాగతం పలికారు. మావోరి సంప్రదాయ నృత్యం హాకాతో మోదీ గౌరవ వందనం స్వీకరించారు. హాకా కళాకారులను ప్రధాని మోదీ అభినందించారు.


