డిసెంబర్లో ఆ్రస్టేలియా టి–20 క్రికెట్ ఆరంభ మ్యాచ్
భారత్లో తొలిసారిగా విదేశీ క్రికెట్ లీగ్ మ్యాచ్
క్రీడా సహకార రోడ్మ్యాప్ను ఆవిష్కరించిన మోదీ, అల్బనీస్
మెల్బోర్న్: శిక్షణ, క్రీడా విజ్ఞానం, సాంకేతికత, క్రీడా పరిశ్రమ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, ఆ్రస్టేలియా నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం శుక్రవారం క్రీడా సహకార రోడ్మ్యాప్ను ఆవిష్కరించాయి. ఇందులో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నైలో బిగ్ బాష్ లీగ్ (టీ–20) ఆరంభ మ్యాచ్ నిర్వహించనున్నారు.
ఈ ఏడాది డిసెంబర్లో చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా జరగనున్న ఆ్రస్టేలియన్ మెన్స్ బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ పెర్త్ స్కార్చర్స్ జట్టుతో మెల్బోర్న్ రెనెగేడ్స్ తలపడనుంది. తద్వారా భారతదేశంలో ఒక విదేశీ క్రికెట్ లీగ్ మ్యాచ్ నిర్వహిస్తుండడం ఇదే మొదటిసారి కానుంది. మొదటి మ్యాచ్ చెన్నైలో, మిగిలిన మ్యాచ్లు ఆ్రస్టేలియాలో జరుగుతాయి.
ఎనిమిది జట్లు పాల్గొనే బీబీఎల్.. ఐపీఎల్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందిన దేశీయ క్రికెట్ టీ–20 లీగ్లలో ఒకటి కావడం విశేషం. ఇది సాధారణంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ శుక్రవారం ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇద్దరు నేతలు స్టేడియం అంతటా కలియతిరుగుతూ సందడి చేశారు. ఫోన్లో సెల్ఫీలు దిగారు. ఫొటోలకు పోజులిచ్చారు. ప్రజలకు అభివాదంచేస్తూ ఉత్సాహపర్చారు. పరస్పరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘చెన్నైలో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ నిర్వహిస్తుండడం నాకు సంతోషంగా ఉంది. భారతదేశంలో మ్యాచ్లు నిర్వహించే ఏ క్రీడా లీగ్ అయినా భారీగా ప్రేక్షకులను ఆకర్శించడం ఖాయం’’అని మోదీ పేర్కొన్నారు. భారత్–ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్మ్యాప్ను మోదీ, అల్బనీస్ సంయుక్తంగా విడుదల చేశారు.
క్రీడా శిక్షణ, క్రీడా విజ్ఞానం, సాంకేతికత, క్రీడా పరిశ్రమ, పెట్టుబడుల రంగాల్లో భాగస్వామ్యాలను ప్రోత్సహించాలన్నదే ఈ రోడ్మ్యాప్ ఉద్దేశం. రోడ్మ్యాప్లో భాగంగా యువ క్రీడాకారుల మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడానికి, క్రీడా సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరు దేశాలు యూత్ స్పోర్ట్స్ ఫెస్టివల్ను కూడా నిర్వహించబోతున్నాయి. ప్రజలను ఏకం చేసే శక్తి క్రీడలకు ఉందని, ఈ రోడ్మ్యాప్ భారత్, ఆ్రస్టేలియా మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి తోడ్పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినందుకు ఆ్రస్టేలియాను అభినందించారు. భారత్, ఆస్ట్రేలియాలు అంతర్జాతీయ క్రీడల్లో ఒక ముఖ్యమైన దశాబ్దంలోకి అడుగుపెడుతున్నాయని పేర్కొ న్నారు. క్రీడల పట్ల ఉన్న ప్రేమ, అభిరుచి ఆ్రస్టేలియా, భారత్ను ఐక్యం చేశాయని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ వ్యాఖ్యానించారు.
విపక్ష నేతతో మోదీ భేటీ
ఆ్రస్టేలియా ప్రతిపక్ష నాయకుడు యాంగస్ టేలర్తో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. భారత్–ఆ్రస్టేలియా ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై అభిప్రాయాలు పంచుకున్నారు. మోదీ మూడు రోజుల ఆ్రస్టేలియా పర్యటన శుక్రవారం ముగిసింది


