‘బలవంతుడ నాకేమని...’ అనుకుంటే దశాబ్దాల తరబడి అమెరికా నిర్మించుకుంటూ వస్తున్న పునాదులు కదిలిపోతాయని ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఇంకా జ్ఞానో దయం కాలేదు. నాటో శిఖరాగ్ర సదస్సుకు పోయి ఈసారి కాస్తంత స్నేహపూర్వకంగా మాట్లాడినా అటువైపునుంచి మునుపటి సాన్నిహిత్యం లేదని తుర్కియేలో ముగిసిన ఆ సదస్సు తీరుతెన్నులు చెబుతున్నాయి. అమెరికాతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలే ఉన్న మన దేశం సైతం ఆయన తరచు చేసే ప్రకటనల కారణంగా ఇబ్బంది పడుతోంది. హఠాత్తుగా ‘ఇండో–పసిఫిక్’ పేరు మారాక లోలోన అసంతృప్తి సరేసరి.
ఈ నేపథ్యంలో ఇండో–పసిఫిక్ విషయంలో మన వైఖరిని తేటతెల్లం చేసేలా, మన చొరవను మరింత పెంచేలా ప్రధాని నరేంద్ర మోదీ ఇండొనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆరు రోజుల పర్యటన ఈ నెల 6న మొదలైంది. ఇప్పటికే ఇండొనేసియా, ఆస్ట్రేలియా పర్యటనలు పూర్తి చేసుకున్న మోదీ శుక్రవారం న్యూజిలాండ్ చేరుకున్నారు. అమెరికా, చైనాలతో... వాటి వైఖరులతో సంబంధం లేకుండా భద్రత, వాణిజ్యం తదితర రంగాల్లో భిన్న దేశాల సహకారం అవసరమని మన దేశం భావించబట్టే ఈ పర్యటన ఖరారైంది. ఈ మూడూ సాగరప్రాంత దేశాలు.
ఎప్పుడో 1992లోనే రూపుదిద్దుకున్న ‘లుక్ ఈస్ట్’ విధానానికి కొనసాగింపుగా మన దేశం ‘మహాసాగర్’ దార్శనికతను ప్రతిపాదించింది. పరస్పర సంపూర్ణ అభివృద్ధికి ప్రాంతాలవారీ భద్రత, సమగ్రవృద్ధి అవసరమన్నదిదాని సారాంశం. సాధారణ ఆర్థిక సంబంధాలు మొదలుకొని భారీ రక్షణ, ఇంధన భాగస్వామ్యం వరకూ అనేకం దీని పరిధిలోకొస్తాయి. ఆస్ట్రేలియాతో గురువారం కుదిరిన పౌర అణుశక్తి ఒప్పందం చరిత్రాత్మకమైనది. ఇదిగాక ఆధునిక సాంకేతికతలూ, రక్షణ, భద్రత సహకారం, సరఫరా గొలుసు మెరుగు పరచటం తదితరాలకు సంబంధించి మరో 18 ఒప్పందాలు కుదిరాయి.
పారిస్ఒప్పందం కింద స్వచ్ఛ ఇంధన లక్ష్యం సాధనకు మన అణు రియాక్టర్లకు నిరంతరాయంగా యురేనియం అవసరమవుతుంది. ప్రస్తుతం ఉన్న 7.7 గిగావాట్ల అణు విద్యుత్ను 2047కల్లా 100 గిగావాట్లకు పెంచాలని భారత్ నిర్దేశించుకుంది. ఇందుకోసం ప్రపంచ యురేనియం నిక్షేపాల్లో 28 శాతంగల ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదరటం కీలక పరిణామం. ప్రపంచ పరిణామాల కారణంగా హఠాత్తుగా నిలిచిపోతున్న ఇంధన సరఫరా తీరును సరిదిద్దటానికి ఎల్ఎన్జీ, బొగ్గు, డీజిల్వంటి సంప్రదాయ ఇంధన వనరుల విషయంలో పరస్పరం సహకరించుకుంటూ ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి.
ఏనాటి నుంచో సాన్నిహిత్యంగల ఇండొనేసియాతో మరిన్ని రంగాల్లో సహకారానికి ఈ నెల 6నుంచి 8వరకూ వరసగా మూడురోజులపాటు కొనసాగిన పర్యటనలో ఒప్పందాలు కుదిరాయి. మన బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల్ని కొనుగోలు చేయటానికి ఇండొనేసియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాలూ కలిసి ఇండొనేసియాలోని ఆచే, అండమాన్, నికోబార్ దీవుల్లో నౌకాశ్రయాలను నిర్మించటానికి కూడా అధినేతలిద్దరూ అంగీకరించారు.
అలాగే హిందూసముద్రం మొదలుకొని పసిఫిక్ మహాసముద్రంవరకూ పరస్పర సహకారంతో సముద్రజలాల్లో భద్రతను పెంచటానికి ఒప్పందం కుదిరింది. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియాలతో ఉన్న సహకారానికి ఇండొనేసియా కూడా తోడుకావటం వల్ల ఇండో–పసిఫిక్లో పటిష్టమైన సమన్వయం ఏర్పడుతుంది. చైనాతో అంటకాగటానికిట్రంప్ ప్రయత్నిస్తున్న దశలో ఇది కీలక పరిణామం.
నిరుడు మన దేశంలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ పర్యటించినప్పుడు ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. దాంతోపాటు మొన్న ఏప్రిల్లో రెండు దేశాలూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదుర్చుకున్నాయి. దీన్ని మున్ముందు మరింత విస్తృతపర్చుకోవటానికి ఇప్పటికే ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. కూటముల్లో చేరే విషయంలో న్యూజిలాండ్కు పెద్దగా ఆసక్తి లేదు. అయితే ప్రాంతీయ భద్రతను పెంపొందించుకోవటానికి భారత్, ఆస్ట్రేలియాలతో కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. మొత్తానికి మోదీ మూడు దేశాల పర్యటన ఇండో–పసిఫిక్లో భారత్ పలుకుబడిని మరింత పెంచుతుంది.


