తన రాజకీయ జీవితంలో ఏనాడూ సవ్యంగా అధికారంలోకి రావటం అలవాటు లేనట్టే... అందలం ఎక్కినప్పుడల్లా సాధారణ పౌరులకు ఆటవిక పాలన రుచిచూపించే ఆనవాయితీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది.‘హే రామ్... సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు బాబు దుష్ట పోకడలకు అద్దం పట్టింది. గూండాలకూ, రౌడీలకూ పార్టీ ముద్రేసి మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయించటం, చివరకు బాధితుల్నే అరెస్టు చేయటం ఏపీలో మాత్రమే కనబడే వింత పోకడ. అలాగే, నిలదీస్తున్నవారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టడం, బెయిలొచ్చినపక్షంలో మళ్లీ మళ్లీ అరెస్టు చేయటం రివాజుగా మారిన తంతు. ఈమధ్య ఏకంగా పోలీసులే యమ కింకరుల పాత్ర పోషిస్తున్నారు. చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీస్తున్నారు. బూడిద కూడా మిగలకుండా చేస్తున్నారు. ముగ్గురు మహిళల అనుమానాస్పద మరణాలు, ఒక దళిత యువకుడి ఆత్మహత్య ప్రజల్ని నివ్వెరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ ఈ పోస్టు పెట్టారు.
‘ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్ట సంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు. అవి మొక్కలై విష వృక్షాలుగా మారుతున్నాయి’ అంటూ జగన్ చేసిన నిశిత విమర్శ చాలా కీలకమైనది. ఇది చంద్రబాబు పాలన తాలూకు డీఎన్ఏ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయనది ఇదే మార్కు ఏలుబడి. ఆ కాలంలో లాకప్ డెత్లు, ఎన్కౌంటర్లతోపాటు నయీంవంటి వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచిన ప్రైవేటు ముఠాలు పాల్పడిన హింసాత్మక ఉదంతాలకు అంతులేదు. వీటన్నిటి వెనకా చంద్రబాబు సర్కారు ప్రమేయం ఉందన్న ఆగ్రహానికితోడు... పలు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు తెగనమ్మడం, కరవుతో బక్కచిక్కిన రైతుల్ని పీడించుకు తినటంవంటి కారణాలతో 2004లో ప్రజలు ఆయన్ను చిత్తుగా ఓడించారు. అలిపిరిలో నక్సలైట్ల దాడిలో గాయపడి, ఆ కట్టుతోనే ఎన్నికల ప్రచారసభల్లో తిరిగినా ఆయనకు సానుభూతి దక్కలేదు. తన నిజస్వరూపం తెలియని ఈ తరానికి తానేమిటో ఇప్పుడు ఆయనే చెప్పక చెబుతున్నారు. గతానికి మించిన అరాచకాన్ని పెంచి పోషిస్తున్నారు.
ఎంతో హేతుబద్ధంగా ప్రశ్నించే ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియోలు సైతం సహించలేని దుఃస్థితికి కూటమి సర్కారు చేరుకుంది. ఉస్మానియా యూనివర్సిటీనుంచి గోల్డ్మెడల్ అందుకున్న జర్నలిస్టు కేవీఆర్ అనని మాటల్ని అన్నట్టుగా చిత్రించి, ఆ నెపంతో హైదరాబాద్లో అర్ధరాత్రి ఆయన ఇంటిపైబడి అరెస్టు చేశారు. వచ్చినవారు పోలీసులో,గూండాలో తెలియక ఆందోళనపడిన ఆయన భార్యను నెట్టేశారు. అసభ్యంగా ప్రవర్తించారు. ప్రశ్న రావణ్ని సైతం ఈ మాదిరిగానే అరెస్టు చేసి తీసుకెళ్లారు. వరసబెట్టి నాలుగు చోట్లా బెయిల్ రావటంతో దిక్కుతోచని కూటమి సర్కారు, ఏకంగా ఉపా చట్టాన్ని ప్రయోగించింది. పోలీస్స్టేషన్లపై జనసేన పేరిట గూండాలు దాడిచేయటం మరో ప్రహసనం.
సరిగ్గా రెణ్ణెల్ల క్రితం విజయవాడ పోలీసులు అరెస్టుచేసి, మాయం చేసిన సాయికృష్ణ కేసులో సర్కారీ పోకడలు మానవతకే మాయని మచ్చ. ఆ యువకుణ్ణి మే 6న అరెస్టు చేశాక అతని తల్లి పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతూనేవున్నా ఒక్కరంటే ఒక్కరు పట్టించుకోలేదు. కనీసం బూడిద ఇస్తే అంతిమసంస్కారం చేసుకుంటామని ఆ తల్లి కన్నీరుమున్నీరవుతున్నా అది అరణ్యరోదనే అయింది. పోలీస్స్టేషన్ డాబాపై ఎముకలు, బూడిద దొరికాయని హైకోర్టుకే కట్టుకథలు చెబుతున్నారు. సాయికృష్ణ తల్లి డీఎన్ఏతో పోల్చిచూడకుండానే ఇంత బాధ్యతారహితంగా చెప్పడం ఆశ్చర్యకరం. అతని హత్య మాత్రమే కాదు... దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్యతోపాటు మే, జూన్ నెలల్లో గంగమ్మ, తిరుపతమ్మల లాకప్ డెత్, మరో మహిళ కళావతి ఆత్మహత్య ప్రజానీకాన్ని దిగ్భ్రాంతిపరిచాయి. రాష్ట్రంలో చట్టం చట్టుబండలైన తీరుపైనా, ఈ హత్యోదంతాలపైనా సీబీఐ దర్యాప్తే సరైంది. ఈ విషయంలో న్యాయస్థానాల్లోనూ, వెలుపలా పోరాడితే తప్ప న్యాయం దక్కదు.


