ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తూర్పు ముంబై పరిధిలో భవనం కూలి ఐదుగురు చిన్నారులు, ఒక మహిళ సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నగరవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలగడంతో పాటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది.
VIDEO | At least six persons were killed and one sustained injuries when a three-storey chawl (row tenement) collapsed in Mumbai’s Mankhurd area amid heavy rains on Sunday night, officials said. Rescue operation is going on. Visuals are from the spot.#Mumbai #Mankhurd pic.twitter.com/IHXyvlRdyP
— Press Trust of India (@PTI_News) July 5, 2026
భారీ వర్షాల కారణంగా ముంబై-పూణె ఎక్స్ప్రెస్వేపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలను నిలిపివేసి, రహదారిని మూసివేశారు. టన్నెల్ పైభాగం నుండి వర్షపు నీరు జలపాతంలా కిందకు పడటం, రహదారిపై రోడ్డు నిర్మాణ శిథిలాల చరియలు విరిగిపడిన దృశ్యాలు స్థానిక టెలివిజన్ ఛానళ్లలో ప్రసామవుతున్నాయి. రహదారి రవాణాతో పాటు విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముంబై-పూణె మధ్య నడిచే దూరప్రాంత రైళ్లను సైతం అధికారులు రద్దు చేశారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
గత నెల చివర నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి నగరంలో చెట్లు విరిగిపడి ఇప్పటివరకు మరో ముగ్గురు మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ముంబై నగరంలో సగటున 100 మిల్లీమీటర్ల (3.9 అంగుళాలు) కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 161 మిల్లీమీటర్ల (6.3 అంగుళాలు) వరకు వర్షం కురిసింది. ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సోమవారం చాలా చోట్ల చాలా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: రుతుపవనాలు ఉధృతం.. పలు నగరాలు అతలాకుతలం!


