అయోధ్య: అయోధ్య రామాలయ కానుకల చోరీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అవినాష్ శుక్లా రూ. 15 లక్షలకు పైగా జరిపిన ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ సొమ్ము ఆలయ విరాళాల దొంగతనంతో ముడిపడి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు తన స్నేహితురాలికి రూ. 2 లక్షల నగదుతో పాటు ఒక ఖరీదైన మొబైల్ ఫోన్ను బహుమతిగా ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఈ డబ్బు మూలాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. నిందితుని సోదరుడు అభిషేక్ తెలిపిన వివరాల ప్రకారం.. అవినాష్ డ్యూటీ ముగిసిన తర్వాత పలుమార్లు యోగా కేంద్రానికి నగదు తీసుకెళ్లడం గమనించినట్లు పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నించగా నిందితుడు దాటవేసే సమాధానం ఇచ్చాడని వెల్లడించారు.
ఈ ఘటనల నేపథ్యంలో రామాలయ ట్రస్ట్ విరాళాల లెక్కింపు గదిలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇకపై టేబుళ్లు, కుర్చీలకు బదులుగా నేలపై పరుపులు, ప్లైవుడ్ ఏర్పాటు చేసి నగదు లెక్కిస్తున్నారు. లెక్కింపు సమయంలో సిబ్బంది ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదని, క్యాంటీన్, బాత్రూమ్లకు తరచూ వెళ్లేవారిపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిఘా విభాగం సిబ్బంది కూడా విధి నిర్వహణలో సీట్లను వదిలి వెళ్లకూడదని స్పష్టం చేస్తూ, గది మొత్తాన్ని సీసీటీవీల పర్యవేక్షణలోకి తెచ్చారు.


