పూణే: మహారాష్ట్రలోని పూణే సమీపంలోని లోహగఢ్ కోట వద్ద జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే, ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. తన మనవడి హఠాన్మరణాన్ని తట్టుకోలేక కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ (71) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. జూన్ 18న లోహగఢ్ కోటపై నుంచి పడి కేతన్ మృతి చెందినప్పటి నుంచి దేవీచంద్ తీవ్ర మనోవేదనతో అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మొదట ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా భావించిన ఈ ఘటనను, పథకం ప్రకారం జరిగిన హత్యగా పూణే రూరల్ పోలీసులు నిర్ధారించారు. కేతన్ కాబోయే భార్య సియా గోయల్, పెళ్లి ఇష్టం లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా తన స్నేహితుడు చేతన్ చౌదరితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితులు ఇద్దరినీ కోర్టు జూలై 16 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. లోహగఢ్ కోటపై డమ్మీతో సీన్ రీక్రియేషన్ చేసిన పోలీసులు, లల్లానగర్ మైదానంలో హత్యకు ముందు వారు చేసిన రిహార్సల్స్ ఆధారాలను సేకరించారు. సియా తండ్రి ప్రవీణ్ గోయల్ ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.


