పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మమతాకు అత్యంత సన్నిహితురాలు, మాజీ మంత్రి చంద్రిమా భట్టాచార్య శనివారం తన పదవికి, పార్టీలోని అన్ని ఇతర బాధ్యతలకు రాజీనామా చేయడం సంచలనం రేపింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత, కొంతమంది కీలక ఎంపీల తిరుగుబాటు, ఇతర ఎదురు దెబ్బలతో పార్టీ ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. తాజా పరిణామం దీనికి మరింత ఆజ్యం పోసింది.
చంద్రిమా భట్టాచార్య రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, జూన్ 3న సుబ్రతా బక్షి స్థానంలో చంద్రిమా భట్టాచార్యను రాష్ట్ర అధ్యక్షురాలిగా మమతా బెనర్జీ నియమించారు. ఇంతలోనే శనివారం ఆమె తన పదవికి రాజీనామా చేస్తూ లేఖను పంపారు. తాను పార్టీ బ్యాంకు ఖాతాల అధీకృత సంతకందారు (authorised signatory) పదవి నుండి, అలాగే భారత ఎన్నికల సంఘం (ECI) ముందు పార్టీ తరపున అధీకృత వ్యక్తిగా ఉండే బాధ్యత నుండి తప్పు కుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ, మమతా బెనర్జీపై తనకు ఎల్లప్పుడూ అత్యంత గౌరవం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు రాజీనామా చేసిన కొద్ది గంటలకే ఆమె తృణమూల్ తిరుగుబాటు (రెబల్) వర్గ నాయకులతో సమావేశం కావడం గమనార్హం.
అటు చంద్రిమ భట్టాచార్య రాజీనామాపై మమతా క్యాంప్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలక పదవులను అనుభవించినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదంటూ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: కేతన్ హత్య : కోడ్వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’
కాగా అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత టీఎంసీ చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యులు రితబ్రత బెనర్జీ నాయకత్వంలో విడిపోయి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడగా, 20 మంది ఎంపీలు కూడా తిరుగుబాటు చేసి, 'NCPI' అనే చిన్న పార్టీతో విలీనమై NDA కి మద్దతు ప్రకటించారు. కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయం 'తృణమూల్ భవన్' నియంత్రణ కోసం శుక్రవారం ఇరు వర్గాల మధ్య తీవ్ర హైడ్రామా నడిచింది. తిరుగుబాటు వర్గం ఆఫీస్ను తమ ఆధీనంలోకి తీసుకుని, తాళాలు మార్చేసి, అరూప్ రాయ్ పార్టీ ఛైర్మన్ అంటూ సైన్బోర్డును ఏర్పాటు చేసింది. తామే "అసలైన టీఎంసీ" అని ఎన్నికల సంఘం ముందు వాదిస్తోంది. దీనికి ప్రతిగా మమతా బెనర్జీ విధేయులు కూడా తృణమూల్ భవన్కు చేరుకుని ఈ ముట్టడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ భారీగా సీఆర్పీఎఫ్,, కోల్కతా పోలీసులను మోహరించారు.
ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్కు ఫౌండర్!


