‘కుక్కల కుంభకోణం’: బయటపెట్టిన మేనకా గాంధీ | Stray Dog Menace Will End in 2 Years Claims Maneka Gandhi | Sakshi
Sakshi News home page

‘కుక్కల కుంభకోణం’: బయటపెట్టిన మేనకా గాంధీ

Jul 4 2026 1:13 PM | Updated on Jul 4 2026 1:17 PM

Stray Dog Menace Will End in 2 Years Claims Maneka Gandhi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరిగిపోతుండటం, ఈ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ సంచలన విషయాలను వెల్లడించారు. కుక్కలను వీధుల నుండి లేదా బహిరంగ ప్రదేశాల నుండి తొలగించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని ఆమె స్పష్టం చేశారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ)కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే ఏకైక మార్గమని, నకిలీ స్వచ్ఛంద సంస్థలు, స్థానిక సంస్థల పర్యవేక్షణ లోపం కారణంగానే నేడు దేశంలో పరిస్థితి ఇంత దారుణంగా తయారయ్యిందని ఆమె ఆరోపించారు.

నకిలీ ఎన్జీవోల కుంభకోణం
గత 25 ఏళ్లుగా యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమాన్ని నిజాయితీగా, శాస్త్రీయంగా అమలు చేసి ఉంటే నేడు వీధి కుక్కల సమస్య ఉత్పన్నమయ్యేదే కాదని మేనకా గాంధీ పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లోని అవినీతి సిబ్బందితో చేతులు కలిపిన కొన్ని నకిలీ ఎన్జీవోలు, రికార్డుల్లో అవసరానికి మించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చూపించి భారీ మోసాలకు పాల్పడ్డాయని ఆమె ఆరోపించారు. దేశంలోని 200 కంటే ఎక్కువ జిల్లాల్లో అర్హత, శిక్షణ లేని ముఠాలకు లంచాల ప్రాతిపదికన ఈ కాంట్రాక్టులు ఇచ్చారని, అక్కడ కనీసం డాక్టర్లు కూడా లేరని ఆమె ఆరోపించారు.

కుక్కల దూకుడుకు అసలు కారణాలివే
శిక్షణ లేని పారిశుధ్య కార్మికులతో ఆపరేషన్లు చేయడం వల్ల కుక్కలు తీవ్రమైన నొప్పితో మరింత హింసాత్మకంగా మారుతున్నాయని మేనకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రాంతంలోని కుక్కలను వేరే ప్రాంతంలో వదిలేయడం వల్ల, అవి కొత్త వాతావరణంలో అభద్రతాభావానికి గురై సాధారణ ప్రజలపై దాడులు చేస్తున్నాయని వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ఎలాంటి రెచ్చగొట్టడం లేకుండా మూడుసార్లు కరిచే కుక్కను మాత్రమే దూకుడు స్వభావం గలదిగా గుర్తించి పర్యవేక్షణలో ఉంచాలని ఆమె గుర్తుచేశారు.

రెండేళ్లలో సమస్యకు శాశ్వత పరిష్కారం
విదేశీ బ్రీడ్స్ కంటే భారతీయ దేశీయ కుక్కలను పెంచుకోవడమే శ్రేయస్కరమని మేనకా గాంధీ సూచించారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డును బలోపేతం చేసి, ఎన్జీవోలకు శిక్షణ ఇచ్చి, ప్రభుత్వం కఠినంగా నిబంధనలను అమలు చేస్తే.. కేవలం రెండేళ్లలోనే కుక్కల దాడుల సమస్యను పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చని ఆమె పేర్కొన్నారు. మానవ భద్రత, జంతు సంక్షేమం పరస్పర విరుద్ధం కాదని, అందరి బాధ్యతాయుతమైన సహకారంతోనే దీనికి శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని మేనకా గాంధీ వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement