సాక్షి, కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బెంగాల్ కోర్టు భారీ షాకిచ్చింది. ద్వేషపూరిత ప్రసంగం (hate speech) ఆరోపణలకు సంబంధించిన కేసులో కోర్టు జారీ చేసిన సమన్లను లెక్క చేయలేదంటూ పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లా కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఆదేశించింది.
పదేపదే సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె కోర్టుకు హాజరుకాలేదని పేర్కొన్న కృష్ణనగర్ కోర్టులోని 3వ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, మొయిత్రాపై తక్షణమే అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఆదేశించారు. అరెస్ట్ వారెంట్ అమలుకు సంబంధించిన నివేదికను ఆగస్టు 28న సమర్పించాలని కూడా కృష్ణనగర్ కోర్టు ఆదేశించింది.
ఇదీ చదవండి: 9 ఏళ్ల బాలికపై హత్యాచారం : గ్రామంలో ఉద్రిక్తత
మొయిత్రా గైర్హాజరును కోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఆదేశాలను వరుసగా ధిక్కరించడం, కోర్టు ఆదేశాలను పాటించడంలో నిందితురాలికి ఉన్న నిర్లక్ష్య వైఖరిని సూచిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం తప్ప ఈ కోర్టుకు వేరే మార్గం లేదని కోర్టు పేర్కొంది. ఆమె ఎప్పటికీ కోర్టుకు హాజరయ్యే అవకాశం లేదని మొయిత్రా తరఫు న్యాయవాది చెప్పారని, దీనిని బట్టి ఆమెకు "న్యాయస్థానం పట్ల గౌరవం లేదని" స్పష్టమవుతోందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!
కాగా మహిళలను అవమానించడం, ద్వేషపూరిత ప్రసంగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మహువాపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. మరుసటి రోజు కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి మంగళవారం (ఆగస్టు 18) ఆమెను ఆదేశించినప్పటికీ, ఆమె హాజరుకాలేదని కోర్టు గుర్తించింది.


